నో లాక్డౌన్: కర్ఫ్యూతోనే సహవాసం: పొడిగింపు: కరోనాతో మరణించిన వారి పిల్లలకు ఆర్థిక సాయం
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కర్ఫ్యూ విధించినప్పటికీ కరోనా వైరస్ ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసులు మరింత పైపైకి వెళ్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ విధించిన అనేక రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు క్రమంగా దిగిస్తోంది. ప్రత్యేకించి- ఢిల్లీలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్డౌన్ విధించడానికి ముందు 25 నుంచి 30 వేలకు వరకు నమోదైన పాజిటివ్ కేసులు.. 6,500లకు పడిపోయాయి.
కోవిడ్పై జగన్ సమీక్ష
ఈ పరిస్థితుల్లో ఏపీలో కూడా లాక్డౌన్ విధిస్తారంటూ వచ్చిన వార్తలకు ప్రభుత్వం తెర దించింది. లాక్డౌన్ను విధించడానికి అంగీకరించలేదు. కర్ఫ్యూను పొడిగించడం వైపు జగన్ సర్కార్ మొగ్గు చూపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ మంగళవారం నాటితో ముగియాల్సి ఉన్న నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమీక్షా సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రోజువారీ కరోనా కేసుల తీవ్రతపై అధ్యయనం చేశారు.
నో లాక్డౌన్.. కర్ఫ్యూ పొడిగింపు
ఈ సందర్భంగా లాక్డౌన్ విధించాలనే ప్రతిపాదన రాగా..వైఎస్ జగన్ గానీ, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయడం కంటే.. ఇప్పుడున్న కర్ఫ్యూను పొడిగించడం వైపే మొగ్గు చూపారు. సంపూర్ణ లాక్డౌన్ విధించినప్పటికీ.. ప్రజల నిత్యావసరాల కోసం ఎలాగూ 10 గంటల వరకు దుకాణాలను తెరచి ఉంచడానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఆ సమయంలో దుకాణాలు, కూరగాయల మార్కెట్లు వంటి చోట్ల రద్దీ అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా..
12 గంటల వరకు గడువు విధించడం వల్ల రద్దీని నివారించినట్టవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న కర్ఫ్యూను మరింత కట్టుదిట్టం చేయడం వల్ల రోజువారీ కరోనా కేసులను నియంత్రించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సూచించినట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కంప్లీట్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. రోజువారీ కేసుల్లో పెద్దగా తగ్గుదల కనిపించట్లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గ్రామాలపై ఫోకస్
ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకన్న తరువాత.. లాక్డౌన్ విధించడానికి బదులుగా కర్ఫ్యూను మరింత కట్టుదిట్టంగా అమలు చేయడం వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఆదేశాలను జారీ చేశారు. కర్ఫ్యూ విధించి 10 రోజులే అయినందున..వాటి ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలైనా అమలు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి- గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని సూచించినట్లు చెబుతున్నారు.
కోవిడ్ వల్ల మరణించిన వారి పిల్లల కోసం ప్రత్యేక నిధి
గ్రామాల్లో వలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దీనికోసం జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. కరోనా బారిన పడి మరణించిన వారి పిల్లలను ఆదుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీనికోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. పిల్లలను ఆదుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. పిల్లల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఏర్పాటు చేయాలని అన్నారు.