ఏపీకి శుభవార్త: త్వరలో శాస్త్రీయ నృత్యంగా ప్రాచీన ‘ఆంధ్ర నాట్యం’
న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో శుభవార్త. సాంప్రదాయ ఆలయ నృత్యంగా చెలామణి అవుతున్న ఆంధ్రా నాట్యానికి కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ నృత్య హోదా ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. శాస్త్రీయ నృత్య హోదా వస్తే ఆంధ్ర నాట్యం కూడా కూచిపూడిలాగా ప్రాచుర్యం పొందనుంది.
శాస్త్రీయ నృత్యంగా గుర్తించండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు కలిసి ఆంధ్ర నాట్యాన్ని దేశంలోని ప్రముఖ శాస్త్రీయ నృత్యం సరసన చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో పుట్టినా కూచిపూడి నృత్యంపై తెలంగాణ రాష్ట్రానికి కూడా సమాన హక్కులు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర నృత్యాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే..
కాగా, కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ ఇప్పటికే ఆంధ్ర నాట్యంను శాస్త్రీ నాట్యంగా గుర్తించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోపాటు ఇందుకు ఓ కమిటీని వేయనున్నట్లు తెలిపారు. అయితే, సంగీత్ నాటక్ అకాడమీ మాత్రం కొంత ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాగా, ట్రడిషనల్ ఫోక్ డ్యాన్స్గా కొనసాగుతున్న ఆంధ్ర నాట్యాన్ని త్వరలోనే శాస్త్రీయ నృత్యంగా గుర్తింపు పొందనుందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇప్పటికే ఆంధ్ర నాట్యాన్ని శాస్త్రీయ నృత్యంగా గుర్తించాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఎంతో ప్రాచీనమైన ఈ నృత్యరీతిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
ప్రాచీన నృత్యం
ఆంధ్రనాట్యం చాలా ప్రాచీనమయిన నృత్య రీతి. ఈ నృత్యం బౌద్ధ కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది గుడిలో దేవాంగనలు ఆడే నృత్యంగా మొదలయి ఒక పూర్తి స్థాయి నృత్యశాస్త్రంగా వికసించింది.
3వేల ఏళ్ల క్రితమే..
ఆంధ్రనాట ఎంతో కాలం ప్రాచుర్యంలో ఉన్న ఈ నాట్యం దేవాలయాలకే కాక ఉత్సవాలలో కూడా ప్రదర్శించబడేది. 3000 యేళ్ళ క్రితం ఈ నాట్యాన్ని సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నిలిపివేశారు. కానీ 50 యేళ్ళ క్రితం ఆంధ్రనాట్యమని నామకరణం చేసి కొందరు ఔత్సాహికులు ఈ నాట్యాన్ని పునరుద్ధరించారు. వీరిలో డా॥నటరాజ రామకృష్ణ ప్రముఖులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ నాట్యాన్ని పూర్తి స్థాయి నృత్య సాంప్రదాయంగా ప్రవేశపెట్టారు. ఆంధ్రనాట్యం అని నామకరణ చేయక ముందు ఈ నృత్యాన్ని వ్యవహారంలో కచేరీ, కేళిక దర్బారు, మేజువాణి మొ॥పేర్లతో పిలిచేవారు. నృత్యం, ఇంకా అభినయం, రెండూ ఈ ప్రాచీన నృత్యంలో కనిపిస్తాయి.
ఈ నృత్యం మూడు విధాలుగా అభివృద్ధి
ఆరాధన నృత్యం- షోడశోపచార పూజలో ఒక ఉపచారం నృత్యం కూడా! దేవాలయాలలో పూజా సమయాలలో నర్తకి ఒక నిర్దిష్ట స్థానం నుండి ఆరాధ్య దేవతనుద్దేశించి నృత్యం చేయటం ఈ ఆరాధన నృత్యంలో భాగం.
ఆస్థాన నృత్యం..
రాజనర్తకులూ, ఆస్థాన నర్తకులూ సాహిత్యం, కవిత్వం, రాజనీతిశాస్త్రం, ఇంకా సాంప్రదాయ సంగీత నృత్యాలలో ఆరితేరే వారు. పండితులు, కవులు, రాజపూజ్యులు, అతిథులు అందరూ పరీక్షించి, యుక్తితో నృత్యం చేయించే వారు. ఆయా వ్యక్తులను రంజింపచేసేందుకు ఈ నర్తకులు నిత్యం సిద్ధంగా ఉండేవారు. రాజులంతరించడంతో ఈ నృత్య రీతి కనుమరుగయినా, ఆ నర్తకుల కుటుంబాలు చాలా వరకూ ఈ శైలిని భద్రపరుచుకుంటూ వచ్చారు.
ప్రబంధ నృత్యం
ఇవి సాధారణ జనం మధ్య ప్రదర్శించేందుకు రూపొందించబడినవి. ఆరాధన, ఆస్థాన శైలిలతో పోల్చితే, ఇది జన సాధారణానికి సులువుగా అర్ధమయ్యే రీతిలో చేయబడేవి. సామాజిక స్థితిగతులు-సమస్యలు వంటి విషయాలపై ఈ నృత్య రీతి అంశాలు ఆధారపది ఉండేవి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భామా కలాపం, గొల్ల కలాపం. భామా కలపాన్నే నవ జనార్ధన పారిజాతం అని కూడా వ్యవహరిస్తారు.