బీహార్ ఫలితాలపై ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి ఏం చెప్పారు?
అమరావతి: బీహార్లో జేడీయూ ముఖ్యనేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు మాహాకూటమి, బీజేపీకి పోరు హోరోహోరీగా ఉంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి.
అయితే అవన్నీ ఫలితాల అనంతరం తప్పని తేలాయి. ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడంలో దిట్ట అయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బీహార్ ఎన్నికల్లో పొరపాటుపడ్డారా? బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిందే జరిగిందా? చూద్దాం.
ఏలూరుకు చెందిన ఆర్జీ ప్లాష్ టీమ్ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో నిజానికి మొదట మహాకూటమికి 160 సీట్లకు పైగా వస్తాయని అంచనాకు వచ్చామనీ, అయితే ప్రధాని మోడీకి వచ్చిన జనాన్ని చూసి కొంత సీట్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు.
ఏదేమైనా మహాకూటమికి విజయం తధ్యమన్న విషయం మొదటి దశ పోలింగ్ అనంతరం మరింత స్పష్టమైందని చెప్పారు. స్థానిక నేతలను పట్టించుకోకపోవడం, సీఎం నితీశ్ పాజిటివ్ ఇమేజ్పైనా దెబ్బ కొట్టాలని చూడటంతో పాటు రిజర్వేషన్లను పునఃసమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ ఛీప్ భగవత్ వ్యాఖ్యల వల్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
నితీశ్ పదేళ్ల పాలనలో బీహార్లో శాంతి భద్రతలను గాడిలో పెట్టడం, మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించడం, స్కూల్ పిల్లలకు సైకిళ్ల పంపిణీ కూడా నితీశ్ కూటమి విజయానికి దోహదపడ్డాయని లగడపాటి వివరించారు. గతంలో యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేశామని, బీహార్లో మొదటిసారి సర్వే చేయడంతో మంచి అనుభవం వచ్చిందన్నారు.
మోడీ సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఓట్లు రాకపోవడానికి కారణం స్థానిక స్థానిక బీజేపీ నేతలను పట్టించుకోకపోవడమేనన్నారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్ధిని కూడా ప్రకటించకుండానే మోడీ అన్ని తానై ప్రచారం చేసినప్పటికీ, ఓట్లను రాబట్టడంలో క్రిందిస్థాయి నాయకత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.