ఆంధ్రా ప్రజలు టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు: నాయిని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్రా ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం తీసుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. కూకట్పల్లి, మల్కాజిగిరిల్లో ఎక్కువగా సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. హైదరాబాద్లోని సామాన్య ఆంధ్రా ప్రజలతో తగాదా లేదని అన్నారు.
తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీని అందరం కలిసి పటిష్టం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ తిరుగులేని పార్టీ అని, తమకు మంచి ముఖ్యమంత్రి దొరికారని నాయిని అన్నారు. దళితులు, వెనకబడిన వర్గాలకు కెసిఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని నాయిని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో 10లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలా? వద్దా? అనేది పార్టీ నిర్ణయమని చెప్పారు.
రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉద్ఘాటించారు.