ఏపీ పోలీస్ భేష్... కరోనా వేళ ఆపరేషన్ ముస్కాన్- 4800 మంది చిన్నారులకు విముక్తి...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ రెక్కాడితే కానీ డొక్కాడని చిన్నారులు మాత్రం షాపుల్లో, చిన్నా చితకా దుకాణాల్లో పనిచేసేందుకు బయటికి వస్తున్నారు. ఇలా బయటికి రావడం వల్ల కరోనా సోకుతుందని తెలియని వారెందరో ఇందులో ఉంటున్నారు. వీరిని కరోనా బారి నుంచి రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం వారం రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ప్రతీ నగరం, పట్టణం, ఊరు, గ్రామం అన్న తేడా లేకుండా పోలీసులు జల్లెడపట్టారు. చివరికి నాలుగు వేల మందిని కాపాడారు.
ఆపరేషన్ ముస్కాన్...
ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా సురక్షితంగా ఇళ్ల వద్దే ఉండాల్సిన పరిస్ధితి. వైరస్ సామాజిక వ్యాప్తి కూడా ప్రారంభమైందనే వార్తలు కూడా వస్తున్న తరుణంలో పెద్దలతో పోలిస్తే భావి భారత పౌరులైన పిల్లలను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి కర్తవ్యం. దీంతో ఏపీ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా పిల్లలను కరోనా బారిన పడకుండా రక్షించేందుకు ఆపరేషన్ ముస్కాన్ కు రూపకల్పన చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. చిన్న చిన్న దుకాణాలతో ప్రారంభించి పెద్ద పెద్ద సంస్ధల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి వారికి విముక్తి కల్పించారు.
భారీగా చిన్నారులకు విముక్తి....
ఏపీ పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిస్ధితుల్లో ఇళ్లలో నుంచి బయటికి వచ్చిన దాదాపు ఐదు వేల మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. పలు చోట్ల చిన్నారులతో పని చేయిస్తున్న యజమానులపై కేసులు కూడా నమోదుచేశారు. చాలా చోట్ల చిన్నారులు ఇరుకైన స్ధలాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, ఇవన్నీ కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రాంతాలేనని పోలీసులు గుర్తించారు. ఇలా గుర్తించిన చిన్నారులందరికీ కరోనా స్క్కీనింగ్ నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ప్రకటించారు.
చిన్నారుల్లో యాచకులు కూడా..
ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పోలీసులు రోడ్లపై అడుక్కుంటున్న ఎందరో చిన్నారులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి అవసరమైన తిండీ, బట్టా, ఇతర సౌకర్యాలు కూడా కల్పించారు. వీరంతా 4 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారేనని అధికారులు తెలిపారు. తాజాగా విముక్తి కల్పించిన 4806 మంది చిన్నారుల్లో 4075 మంది బాలలు, 731 మంది బాలికలు ఉన్నారు. అలాగే 72 మంది ఒడిశా, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కేంద్రం ఆదేశాల అమలు...
2015లోనే వీధి బాలలు, ప్రమాదకర పరిస్ధితుల్లో ఉన్న పిల్లలను రక్షించేందుకు రాష్ట్రాలు ఆపరేషన్ ముస్కాన్ ను విస్తృతంగా నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు దశల వారీగా నిర్వహిస్తున్నాయి. ఏపీలోనూ ఇప్పటికే పలుమార్లు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి వందల సంఖ్యలో చిన్నారులకు విముక్తి కల్పించారు. మరోసారి కరోనా సమయంలో దీన్ని నిర్వహించడం ద్వారా బాలలను వెట్టి చాకిరీ నుంచే కాక కరోనా బారి నుంచి కాపాడినట్లయింది. దీంతో ఏపీ పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చిన్నారులను రక్షించేందుకు ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించకపోవడం విశేషం.