ఏపీ 10th ఫలితాలు విడుదల: కడప ఫస్ట్.. చిత్తూరు లాస్ట్
విశాఖపట్నం: ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ హాలులో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 17వేల 30మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాశారన్నారు.
వీరిలో మొత్తం 94.52 శాతం ఉత్తీర్ణలు అయ్యారని పేర్కొన్నారు. బాలురు 94.33 శాతం, బాలికలు 94.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కాగా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వైయస్సార్ కడప జిల్లా 98.89 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 90.11 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 3 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. కాగా, జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. www.bseap.org, www.indiaresults.com వెబ్సైట్ల ద్వారా పదో తరగతి ఫలితాలను తెలుసుకోవచ్చు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ ద్వారా ఈ ఫలితాలకు సంబంధించిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని మంత్రి గంటా తెలిపారు. వాయిస్ రికార్డర్ మోడ్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకొనే ఏర్పాట్లు చేశారు. వాయిస్ రికార్డర్ మోడ్ కోసం 58888 నంబర్కు లేదా స్టార్ 588 యాష్కు కాల్ చేయవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా పదో తరగతి పరీక్షా ఫలితాలను తెలుసుకోవాలనుకునే వారు ఏపీ10(స్పేస్)రోల్ నంబర్ను టైప్ చేసి 58888కు ఎస్ఎంఎస్ చేయవచ్చని తెలిపారు.