గోదావరి లాంచీ ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య: సురక్షితంగా బయటపడ్డ వారు వీరే..
Recommended Video
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటకుల లాంచీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. విశాఖపట్నం నుంచి బయలుదేరి వచ్చిన నౌకాదళ హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మొత్తం 24 మంది గల్లంతైనట్లు తేలిన నేపథ్యంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గల్లంతైన ఆచూకీ కోసం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, రాష్ట్ర విప్తతు నిర్వహణ బలగాలు, స్థానిక పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను చేపట్టారు. కాగా..ఈ లాంచీలో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గాయపడ్డ వారిని రంప చోడవరం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు.
రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపు
సురక్షితంగా ఒడ్డున చేరిన వారి పేర్లు ఇవే..
పాపికొండల అందాలను తిలకించడానికి దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో లాంచీ బోల్తా పడిన ఘటనలో సుమారు 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. బీ వెంకటస్వామి (హైదరాబాద్), ఎండీ మజర్ (హైదరాబాద్), రామారావు (హైదరాబాద్), కే అర్జున్ (హైదరాబాద్), జే కుమార్ (హైదరాబాద్) సురేష్ (హైదరాబాద్), కిరణ్ కుమార్ (హైదరాబాద్), శివశంకర్, రాజేష్ (హైదరాబాద్), గాంధీ (విజయవాడ), మధులత (తిరుపతి), బూసల లక్ష్మి (విశాఖపట్నం) సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. వారిని లారీలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన నుంచి వారు తేరుకోలేకపోతున్నారు. వారిలో చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయపడ్డ వారిని రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సంఘటనాస్థలానికి ఎమ్మెల్యేలు.. జిల్లా పాలనా యంత్రాంగం
కచ్చులూరు వద్ద పర్యాటకుల లాంచీ బోల్తా పడిన సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యేలు బాలరాజు (పోలవరం), జక్కంపూడి రాజా (రాజానగరం) సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి పరిస్థితిన సమీక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ హషీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కచ్చులూరుకు చేరుకున్నారు. రాత్రికి హోం శాఖ మంత్రి సుచరిత, రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. దేవీపట్నం నుంచి పోలవరం వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని మృతదేహాలు తీరం సమీపంలో తేలుతూ కనిపించినట్లు చెబుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు
కాగా, బాధితుల కుటుంబ సభ్యులకు సరైన సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వం మూడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ జిల్లా కలెక్టరేట్లలో వాటిని ఏర్పాటు చేశారు. 1800 425 00002 టోల్ ఫ్రీ నంబర్ కంట్రోల్ రూమ్ ను విశాఖపట్నంలో, 1800 233 1077 నంబర్ గల కంట్రోల్ రూమ్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కంట్రోల్ రూమ్ లో పదిమంది సిబ్బందిని నియమించారు. బాధితుల కుటుంబీలకు సరైన సమాచారాన్ని ఇవ్వడానికి 24 గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.