తుందుర్రు పోరాటంపై అణచివేత!: 'నిరాహార దీక్ష' భగ్నం, గ్రామంలో ఉద్రిక్తతలు..
తుందుర్రు గ్రామస్తులు గత కొన్ని నెలలుగా ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వారు నిరాహారదీక్షకు కూడా దిగారు. అక్టోబర్ 15, తెల్లవారుజామున పోలీసులు వీరి దీక్షను భగ్నం చేయడంతో గ
Recommended Video
భీమవరం: తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై అటు ప్రభుత్వం, ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా గోదావరి కలుషితమై.. తమ జీవనాధారం దెబ్బతింటుందని అక్కడి రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు.
గోదావరి రైతులకు జీవన్మరణ సమస్యగా ఆక్వాపార్కు: ప్రశ్నించే జనసేన.. సీఎం కావాలని ఆకాంక్షించే జగన్ ఎక్కడ
అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తుందుర్రు బాధితుల పట్ల మాట్లాడినట్టు చేశారు కానీ ఆయన మాటలేవి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాత్కాళికంగా కొద్దిరోజులు ఓపిక పట్టి.. ఫ్యాక్టరీ పనులు మళ్లీ వేగవంతం చేసింది. దీంతో తుందుర్రు గ్రామస్తులు గత కొన్ని నెలలుగా ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు.
నిరాహార దీక్ష భగ్నం:
ఈ నేపథ్యంలోనే వారు నిరాహారదీక్షకు కూడా దిగారు. అక్టోబర్ 15, తెల్లవారుజామున పోలీసులు వీరి దీక్షను భగ్నం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహారదీక్ష చేస్తున్నవారి సీపీఎం, ఏఐడబ్ల్యూఏ(ఆల్ ఇండియా డెమోక్రటిక్ వుమెన్) సభ్యులు కూడా ఉన్నారు. వీరి ఆరోగ్యం గత మూడు రోజులుగా క్షీణించడంతో పోలీసులు బలవంతంగా వారి దీక్షను భగ్నం చేశారు.
ఆందోళనకారుల నిరసన
ఆదివారం తెల్లవారుజామున గ్రామంలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. నిరాహారదీక్షను భగ్నం చేసి, దీక్ష చేస్తున్నవారిని నరసాపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. 14మంది ఆందోళనకారులు వాహనాలకు అడ్డుపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అరెస్టులు, పూచీకత్తుపై విడుదల
ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసు చర్యలు బాధాకరమన్నారు. తమ విధులకు అడ్డు వస్తారన్న కారణంతో.. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు.
నిరాహార దీక్ష చేస్తున్న ఎనిమిది మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వ్యక్తిగత పూచీ మీద ఆ తర్వాత వారందరినీ పోలీసులు విడిచిపెట్టారు.
ఫ్యాక్టరీ నిర్మాణంపై ఎవరి వాదనెలా?
ఆనంద గ్రూప్ ఆధ్వర్యంలో 55ఎకరాల్లో ఆక్వా పార్కు నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. అయితే ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల నదీ జలాలు కలుషితమవుతాయని, తద్వారా తమ పాడి పంటకు నష్టం వాటిల్లుతుందని అక్కడి రైతులు వాపోతున్నారు. మరోవైపు ఆక్వా యాజమాన్యం మాత్రం ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థాలు విడుదల కావని చెబుతోంది.
ఈ ఆక్వా ఫ్యాక్టరీ దాదాపు 3వేల టన్నులు చేపలను నిలువ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఒకటిన్నర ఎకరంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, మిగతా స్థలంలో మొక్కలు పెంచి గ్రీనరీకి తోడ్పడుతామని చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.120కోట్లుగా తెలుస్తోంది. ఇందులో 40శాతం నిధులు కేంద్రం అందిస్తున్నట్టు సమాచారం.