దిశా యాప్కు దొరికిపోయిన ఏయూ కీచక ప్రొఫెసర్: కామంతో కెరీర్ నాశనం చేసుకున్నాడు!
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇన్ఆర్గానిక్, ఎనలిటికల్ కెమెస్ట్రీ విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ కె బసవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందడంతో అతడ్ని పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం కూడా అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
ప్రతిభావంతుడే కానీ..
మంచి ప్రతిభావంతుడైన ప్రొఫెసర్గా పేరున్న బసవయ్య.. అదే సమయంలో తన ప్రవర్తనతో వ్యక్తిగతంగా చెడ్డు పేరు కూడా తెచ్చుకున్నారు. 2003లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన బసవయ్య.. 2003లోనే అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. అంతా బాగానే ఉన్నా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తన పేరును తానే చెడగొట్టుకున్నాడు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా..
ఇప్పటికే పలుమార్లు విద్యార్థినులు సదరు ప్రొఫెసర్పై ఫిర్యాదులు చేశారు. అయితే, వర్సిటీ ఉన్నతాధికారులు మాత్రం అతనిపై చర్యలు తీసుకోలేదు. అప్పుడే చర్యలు తీసుకున్నట్లయితే బాగుండేది. తాజాగా, ఏపీలో తీసుకొచ్చిన దిశా యాప్ ద్వారా అతని వెకిలిచేష్టలు ప్రపంచమంతా తెలిసిపోయింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు ప్రొఫెసర్పై చర్యలు తీసుకోక తప్పదని ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. అరెస్టుపై అధికారిక సమాచారం వచ్చిన వెంటనే బసవయ్యపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
చివరకు దిశా యాప్తో దొరికిపోయాడు..
మంగళవారం తెల్లవారుజామున ఓ మహిళా అధికారి విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న ప్రొఫెసర్ బసవయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన దిశా యాప్ ఓపెన్ చేసిన బాధితురాలు.. వెంటనే ఎస్ఓఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో తెల్లవారుజామున 04.21 నిమిషాలకు మంగళగిరి దిశా కాల్ సెంటర్కు ఎస్ఓఎస్ కాల్ వెళ్లింది. అక్కడ్నుంచి కాల్ సెంటర్ ద్వారా దగ్గరలోని ఎమర్జెన్సీ సెంటర్కు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు బాధితురాలి వద్దకు చేరుకున్నారు. సదరు మహిళ అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ బసవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు సీఎం అభినందనలు..
కాగా, దిశా యాప్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోపే బాధితురాలికి సాయం అందించడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు పోలీసు విభాగాన్ని అభినందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశా యాప్ పనితీరు గురించి సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. దిశా యాప్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జగన్.. బాధితురాలికి వెంటనే సహాయం అందించిన పోలీసులకు అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు.