మార్చిలో ఎపి బడ్జెట్ సమావేశాలు...గ్రీవెన్స్ కు అధిక ప్రాధాన్యం
రాజమహేంద్రవరం: మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ సమావేశాలు దాదాపు 20 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.రాజమహేంద్రవరంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
బడ్జెట్ సమావేశాల గురించి యనమల వివరిస్తూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్పై ఫైనాన్స్ సెక్రటరీ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకు బడ్జెట్ తుది రూపు దిద్దుకుంటుందని చెప్పారు. మార్చి మొదటివారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం గడచిన మూడేళ్లలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువే పని చేసిందని, అయితే ఇవాళ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పారు.
కేటాయింపుల కంటే అదనంగా...
బడ్జెట్ కేటాయింపులే కాకుండా నీటి పారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు అదనంగా ఖర్చు చేశాయని, వాటికి రూ.13వేల కోట్లు అదనంగా ఇచ్చామని మంత్రి యనమల వివరించారు. ధీనివల్ల మూలధన వ్యయం బడ్జెట్లో 10 నుంచి 15శాతం పెరిగిందన్నారు.
మూలధన వ్యయం...
మూలధన వ్యయం అభివృద్ధికి సూచన అని, కేవలం అర్థ సంవత్సరంలో రూ.10వేల కోట్లు మూల ధన వ్యయం చేశామని గమనించాలని యనమల తెలిపారు. రెవెన్యూ ఖర్చు ఇంకా పెరుగుతోందని అయితే దానిని కంట్రోల్ చేసుకోవచ్చని చెప్పారు.
గ్రీవెన్స్ కు ప్రాధ్యాన్యత...
రాబోయే బడ్జెట్లో పబ్లిక్ గ్రీవెన్స్కు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్టు మంత్రి యనమత స్ఫష్టం చేశారు. ఇప్పటి వరకు గ్రీవెన్స్లో సుమారు కోటిన్నర ఫిర్యాదుల వరకు అందాయని, వాటిలో ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపు ఉందని యనమల వివరించారు. 1100 ఫిర్యాదుల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని తెలిపారు.
రెవిన్యూ లోటు...
ప్రస్తుతం రూ.70 వేల కోట్లు లోటు ఉందని, కేంద్రం నుంచి అనుకున్న విధంగా ఆదాయం రావడం లేదని మంత్రి యనమల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం గడచిన మూడున్నర ఏళ్లలో రూ.60వేల కోట్ల అప్పుల్లో ఉందని, కొన్ని శాఖలకు ఇంకా బిల్లులు చెల్లించవలసి ఉందని తెలిపారు. అయితే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి దేశ, విదేశీ కంపెనీలను పెద్ద ఎత్తున ఆహ్వానించామని, దీంతో ఇక్కడ భారీగా పెట్టుబడులు రానున్నాయని అన్నారు.