రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు- నాలుగు బిల్లులు, నాలుగు ఆర్డినెన్స్ లు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత సమావేశమైన అసెంబ్లీ, మండలి బీఏసీలు నిర్ణయం తీసుకున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, బడ్జెట్ ప్రసంగాలు ఉండబోతున్నాయి. సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత శాఖల మంత్రులు ఇరు సభల్లోనూ ప్రవేశపెట్టబోతున్నారు.
రేపు నాలుగు కీలక బిల్లులతో పాటు నాలుగు ఆర్డినెన్స్ లను సభ ముందుకు తీసుకు రానున్నారు. ఇందులో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలతో పాటు ద్రవ్య వినిమయ బిల్లు, రాజధానికి సంబంధించిన రెండు బిల్లులు ఉండబోతున్నాయి.
ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఆమోదించిన రాజధాని బిల్లులను మండలి సెలక్ట్ కమిటీ పేరుతో జాప్యం చేస్తున్న నేపథ్యంలో మరోసారి వీటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మండలిలో ఇవే బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. దీంతో రేపటి సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.