మంత్రుల మాటేంటీ? మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజ
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబు సహా.. దాదాపు మంత్రులందరిపైనా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి రెండు రౌండ్లలోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగింది. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో మంత్రి అచ్చెన్నాయుడిదీ అదే పరిస్థితి.
గుంటూరు జిల్లా వేమూరులో నక్కా ఆనందబాబు, చిలకలూరి పేటలో ప్రత్తిపాటి పుల్లారావు వెనుకంజలో ఉన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కడప జిల్లా జమ్మలమడుగులో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తొలి రెండు రౌండ్లలో పుంజుకోలేకపోయారు. వారిపై వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు పైచేయి సాధించారు. కృష్ణాజిల్లా మైలవరంలో దేవినేని ఉమా మహేశ్వరరావు వెనుకంజలోనే ఉన్నారు. ఇదే పరిస్థితి చివరి వరకూ కొనసాగితే- మంత్రివర్గంలో మెజారిటీ సభ్యులు ఓటమి పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
లోక్సభ స్థానాల్లోనూ కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ హవా