ఏపీ బిజెపిలో చీలిక, వైసీపీకి కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్:జూపూడి, 'కన్నాకు జగన్ వల్లే పదవి'
అమరావతి: బిజెపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షపదవికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై రానున్ రోజుల్లో ఆ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయే అవకాశం ఉందని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. బిజెపి, వైసీపీలకు కాంగ్రెస్ కు పట్టిన గతే పట్టనుందని ఆయన హెచ్చరించారు.
జూపూడి ప్రభాకర్ రావు సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బిజెపి ఏపీ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా, వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి, వైసీపీ నేతలు తాకట్టు పెట్టారని జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని కన్నా లక్ష్మీనారాయణకు బిజెపి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే తేలిపోయిందన్నారు.
రెండుగా చీలనున్న బిజెపి
ఏపీ రాష్ట్రంలో బిజెపి రెండుగా చీలిపోయే అవకాశం ఉందని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు . బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు కట్టబెట్టడంపై సోము వీర్రాజు వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్నవారితో పాటు పార్టీలోని సీనియర్లు ఒకవైపు, ఇతరులంతా మరోవైపు ఉండే అవకాశం లేకపోలేదని జూపూడి ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు.
బిజెపికి ప్రెసిడెంట్, వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కన్నా
ఏపీలో వైసీపీ, బిజెపిల మధ్య రహస్య అవగాహన ఉందనే విషయం బిజెపికి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో తేటతెల్లమైందని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. వైసీపీలో చేరడానికి ముహుర్తం నిర్ణయించుకొని గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనేందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. బిజెపికి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా, వైసీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్ పట్టిన గతే
ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు ఏ రకమైన బుద్దిచెప్పారో బిజెపి, వైసీపీలకు కూడ ప్రజలు రానున్న రోజుల్లో అదే రకమైన బుద్ది చెబుతారని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు హెచ్చరించారు. ఈ రెండు పార్టీలు కుమ్మకై రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా భ్రష్టుపట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
జగన్ వల్లే కన్నా లక్ష్మీనారాయణకు పదవి
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సిఫారసుల మేరకే బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మీనారాయణకు దక్కిందని టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఏపీలో బీజేపీ..భారతీయ జగన్ పార్టీగా మారిందని అభివర్ణించారు. బీజేపీ, జగన్ లది అపవిత్ర కలయికని చెప్పారు. బిజెపికి వైఎస్ జగన్ పార్టీ అద్డె మైకులా మారిందని ఆయన ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జగన్ నిధులు సమకూర్చారని ఆరోపించారు.