త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గూగుల్ ఉచిత వైఫై సేవలు...ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ తో ఒప్పందం
Recommended Video
అమరావతి:ఇక పల్లె లేదు..పట్టణం లేదు...ఎక్కడైనా సరే...ఎప్పుడైనా ఇంటర్నెట్ ని ఫుల్లుగా...ఫ్రీగా వాడేసుకోవచ్చు..! అదెలాగ?...దానికి మనమేం చెయ్యాలి?... అనుకుంటున్నారా!...మీరేం చెయ్యనక్కరలేదు అంతా గూగుల్ కంపెనీయే చూసుకుంటుంది.
ఆశ్చర్యంగా ఉందా?...దానివల్ల గూగుల్ కి ఏంటి లాభం అని మళ్లీ ఇంకో డౌటా?...సరే అయితే వివరంగా తెలుసుకుందాం...ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందించాలన్న ఎపి ప్రభుత్వం సంకల్పం మేరకు ఉచిత వైఫై సేవల కోసం ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్(ఏపీఎస్ ఎఫ్ ఎల్) పిలిచిన టెండర్లలో గూగుల్ సంస్థ పాల్గొని విజయవంతంగా ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ మేరకు గూగుల్ సంస్థ ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలను అందించనుంది.
టెండర్...గూగుల్ కే!
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలను అందించేందుకు గాను గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎఫ్ ఎల్) ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో గూగుల్ పాల్గొనడం ద్వారా గూగుల్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీఎస్ ఎఫ్ ఎల్ సీఈవో దినేశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
రైల్వే నుంచి...రాష్ట్రవ్యాప్తంగా
ప్రస్తుతం ప్రధాన రైల్వే స్టేషన్లలో ‘రైల్ టెల్' పేరిట గూగుల్ ఈ తరహా వైఫై సేవలను అందిస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రయాణికుడి మొబైల్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ప్రకారం సదరు ప్రయాణికుడు 45 నిమిషాలపాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,900 గ్రామాలు మరియు పట్టణాలు, నగరాలకు ఈ సేవలు పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలవగా గూగుల్ సంస్థ దక్కించుకుంది.
ఒప్పందం...ముఖ్యాంశాలు
ఏపీఎస్ ఎఫ్ ఎల్తో గూగుల్ కు కుదిరిన ఒప్పందం ప్రకారం...జీ-వై ఫై స్టేషన్ల వద్ద 45 నిమిషాల నుంచి గంట వరకూ ఏక విడతలో ఉచితంగా ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ సమయం ముగిశాక...మళ్లీ మరో సెషన్కు వెళ్లవచ్చు. ఇలా విడతల వారీగా రోజులో ఎంతసేపైనా ఫ్రీగా నెట్ వాడుకోవచ్చు. ఒక్కో ఊరికి రెండు చొప్పున రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రూటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మునిసిపాలిటీల్లో వార్డుకు రెండు చొప్పన దాదాపు 4000 చోట్ల రూటర్లను ఏర్పాటు చేస్తారు. ఉచిత వైఫై సేవలు అందించేందుకు గూగుల్తో ఒప్పందం చేసుకున్న ఏపీఎస్ ఎఫ్ ఎల్ ఆ మేరకు రూటర్ల సరఫరా కోసం మళ్లీ టెండర్లను ఆహ్వానించింది.
త్వరలోనే...అందుబాటులోకి
ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి...పనులు పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రూటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏపీఎస్ ఎఫ్ ఎల్ సీఈవో దినేశ్ కుమార్ చెప్పారు. దీంతోపాటు గూగుల్ యాప్ ఉండే ఆండ్రాయిడ్ టెలివిజన్ ఉన్న వారికి ప్రత్యేక సెట్టాప్ బాక్సులను కూడా అందజేస్తామన్నారు. వీటిద్వారా ‘మీ సేవ' కింద పౌరులకు అందజేస్తున్న సేవలన్నీ వినియోగించుకునే అవకాశం కలుగుతుందంటున్నారు. ఇందుకోసం వాయిస్ ఓవర్ యాప్నీ గూగుల్ అందజేస్తుందని తెలిపారు. అయితే పబ్లిక్ వైఫై లను వాడుకునే క్రమంలో అప్రమప్తంగా వ్యవహరించాలని మరోవైపు సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.