అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
దిశ సంఘటనతో దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. దిశ అత్యాచారం, హత్య తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇలాంటీ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతూనే..మరోవైపు చట్టాల్లో కూడ మార్పులు తీసుకువస్తున్నారు. సామాజికంగా అత్యాచారాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు అమలు చేయడం ద్వార సామాజికంగా మార్పులు రావాలనే యోచనలో పలుప్రభుత్వాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ క్రిమినల్ చట్టాల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి వెంటనే శిక్షలు పడేలా చట్ట సవరణ చేసేందుకు ఏపీ కేబినేట్ అమోదించింది.
ఏపీ క్రిమినల్ లా సరణకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణకు చట్టాలను మరింత కఠినతరం చేయనుంది. తెలంగాణలో దిశ సంఘటన జరగిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే దిశ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దీంతో ఏపీలో చట్టాలను కఠినతరం చేయాలని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే చట్టాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించారు. ఏపీ క్రిమినల్ లా చట్టంలో మార్పులు చేస్తూ... రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం పూర్తి స్థాయిలో సవరించిన చట్టాలు అమల్లోకి రానున్నాయి.
ఏపీ దిశ యాక్ట్
ఏపీ క్రిమినల్ లా చట్టానికి మార్పులు తెస్తూ... ఏపీ దిశ యాక్ట్గా దానికి పేరు పెట్టారు. ఈ చట్టం ప్రకారం ముఖ్యంగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు నేరం రుజువైన 21 రోజుల్లోనే తీర్పు వెలువరించనున్నారు. కాగా వారికి ఉరిశిక్ష విధించేందుకు చట్ట సవరణ తేనున్నారు. ఇందుకోసం క్రిమినల్ యాక్ట్ 354కు సవరణ చేసి దానికి అదనంగా నిబంధనలు చేర్చనున్నారు.
వారం రోజుల్లో విచారణ పూర్తి,
ఇక మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచార కేసులు నమోదు అయిన తర్వాత జాప్యం లేకుండా కేవలం వారం రోజుల్లోనే పోలీసుల విచారణ పూర్తి చేసి అనంతరం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఇక కోర్టులో సైతం రెండు వారాల్లో కేసు విచారణను పూర్తి చేసి మరో వారం రోజుల్లో నిందితులకు శిక్ష ఖారారు చేయాల్సి ఉంటుంది. కాగా చట్టసవరణకు ముందు కేసు విచారణ కోసం నాలుగు నెలల సమయం ఉండేది..ప్రస్తుత చట్టసవరణ ద్వార అది వారం రోజులకు కుదించబడుతోంది.
సోషల్ మీడియాలో కించపరిచినా కేసులు నమోదు
మరోవైపు మహిళలపై సోషల్ మీడియాలో కించపరుస్తూ... పోస్టులు పెడుతుండడంతో వాటిని కూడ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందుకోసం అదే చట్టంలోని కొత్త నిబంధనను తీసుకురానుంది. ఈ నిబంధనతో సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారికూడా అదేవిధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు.
చిన్నారుల అత్యాచారాలపై కఠిన చట్టం
చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడనుంది. కాగా పోక్సో చట్టం ద్వార ఇప్పటివరకూ మూడేళ్ల నుంచి అయిదేళ్ల వరకూ మాత్రమే జైలుశిక్ష విధిస్తున్నారు. కాగా ఈ శిక్షను పెంచుతూ ఈ బిల్లులో అమెండ్మెంట్ చేయనున్నారు. మరోవైపు మహిళలపై అత్యాచారాలను విచారించేందుకు ఆయా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు కూడ ఏర్పాటు అంశాలను బిల్లులో పొందుపరిచారు. ఈ అంశాలన్నింటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చించిన అనంతరం అమోదం పోందనుంది.