ఏప్రిల్ లో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ: భూమాకు నో ఛాన్స్? లోకేష్ కు బెర్త్ ఖాయం
ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ ఏప్రిల్ మాసంలో జరిగే అవకాశం ఉంది.అయితే వైసిపి నుండి వచ్చిన భూమా నాగిరిడ్డికి మంత్రివర్గంలో ఛాన్స్ అనుమానంగానే కన్పిస్తోంది.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణ ఏప్రిల్ మాసంలో జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణలో వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలోకి వచ్చిన భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో చాన్స్ దక్కకపోవచ్చనే ప్రచారం కూడ సాగుతోంది. సాంకేతిక కారణాలను చూపుతూ భూమా నాగిరెడ్డికి ఈ దఫా మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం లేదనే ప్రచారం ఉంది.అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన చినబాబు లోకేష్ కు మంత్రిపదవి ఖాయంగా కన్పిస్తోంది.కాని, కొందరు మంత్రులకు స్థాన భ్రంశం తప్పకపోవచ్చు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ మేరకు పార్టీ నాయకులకు సంకేతాలు ఇచ్చారని సమాచారం.
ఈ ఏడాది జూన్ మాసం వస్తే ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్ళు పూర్తి కానుంది.అయతే ఈ మూడేళ్ళ కాలంలో మంత్రుల పనితీరును అంచనా వేసిన చంద్రబాబునాయుడు కొందరికి ఉద్వాసన చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది.
మరో వైపు వైఎస్ఆర్ సిపి నుండి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాలు కూడ లేకపోలేదు.అయితే వైసిపి నుండి వచ్చిన ఎమ్మేల్యేలను మంత్రివర్గంలోకి తీసుకొంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని గవర్నర్ కొంత నిస్సహయతను వ్యక్తం చేశారని సమాచారం.
భూమా నాగిరెడ్డికి ఛాన్స్ కష్టమేనా?
వైఎస్ఆర్ సిపి నుండి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది.అయితే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అదే తీరులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే విమర్శలకు గురికావాల్సిన పరిస్థితులు ఉంటాయని రాజ్ భవన్ వర్గాలు నిస్సహయతను వ్యక్తం చేయడంతో భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో చోటు విషయమై కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో టిడిపి నుండి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.అయితే ఈ విషయంలో గవర్నర్ పై టిడిపి విమర్శలు గుప్పించింది. ఇదే తరహలో భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొంటే అదే తరహ పరిస్థితి నెలకొనే అవకాశం లేకపోలేదని గవర్నర్ అభిప్రాయపడినట్టు సమాచారం.అయితే రాజీనామా చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకోవాలని వార్తలు వెలువడ్డాయి.ఈ తరుణంలో చంద్రబాబునాయుడు భూమా నాగిరెడ్డికి మంత్రివదవిని కట్టబెడుతారా లేదా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.మరో వైపు అఖిల ప్రియకు కూడ ఇదే పరిస్థితి వర్తించనుంది.దీంతో బాబు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ఆసక్తికరంగా మారింది.
లోకేష్ కు మంత్రివర్గంలో చోటు
చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ కు మంత్రిపదవిని కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మేల్సీగా లోకేష్ ఎన్నికయ్యారు.ఎమ్మేల్యే కోటాలో ఎమ్మేల్సీగా లోకేష్ ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశాల తర్వాత లోకేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. తన వద్ద ఉన్న కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి లోకేష్ కు కట్టబెట్టే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఇతర మంత్రుల వద్ద ఉన్న కొన్ని శాఖలను కూడ లోకేష్ కు కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు.
ఏప్రిల్ లో మంత్రివర్గ విస్తరణ
లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకొంటానని బాబు తన మంత్రివర్గ సహచరుల వద్ద వ్యక్తం చేసినట్టుగా సమాచారం.లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే త్వరగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.మంత్రివర్గ విస్తరణ గురించి మీడియా మిత్రులు అడిగిన సమయంలో అన్నీ మీకు చెప్పి చేయడం లేదుగా అంటూ చంద్రబాబు మీడియాను ప్రశ్నించారు.ఏప్రిల్ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్య మంత్రి సన్నిహితులు చెబుతున్నారు.
మంత్రి పదవుల కోసం ఎమ్మేల్యేల ప్రయత్నాలు
ఈ దఫా విస్తరణలో తమకు మంత్రి పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చేవారు లేకపోలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను కూడ కాదని కొందరికి మంత్రివర్గంలో చోటుకల్పించారు.అయితే కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించినా కాని పార్టీకి ప్రయోజనం కలగలేదనే అభిప్రాయంతో బాబు ఉన్నారు.అదే సమయంలో పార్టీతోనే ఉన్నవారికి పదవుల పందేరంలో చోటు దక్కేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు పార్టీ నాయకులు.పార్టీ కోసం పనిచేసిన కరణం బలరాం, వావిలాల సునీతకు ఎమ్మేల్సీగా బాబు టిక్కెట్టు కట్టబెట్టారు.దీంతో మంత్రి పదవుల విషయంలో కూడ పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.
మహనాడుకు ముందే మంత్రివిస్తరణ పూర్తి
ఏప్రిల్ మూడో వారం నుండి పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ నాయకులు బిజీ బిజీగా ఉంటారు.అయితే మే మాసంలో పార్టీ మహనాడును నిర్వహిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాగత నిర్మాణాలకు సంబందించిన షెడ్యూల్ ను పూర్తి చేసేందుకుగాను ఇప్పటికే తేదీలను ప్రకటించారు. వార్డు, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీల ఎన్నికలు పూర్తిచేసుకొని రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్నారు.ఏప్రిల్ రెండో వారం లోపుగానే మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని బాబు బావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.ఏప్రిల్ మూడో వారం దాటితే సంస్థాగత కార్యక్రమాలకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు లేకపోలేదు.