ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్: శ్రావణమాసం ఆరంభంలోనే: ఆ పీఠాధిపతి సలహా?
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయబోతున్నారు. పిల్లి సుభాష్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో రాజ్యసభ సభ్యులుగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తోంది.
సుచరితకు డిమోషన్..కన్నబాబుకు ప్రమోషన్? కేబినెట్లో పెను ప్రక్షాళన: హోం మంత్రిగా సీనియర్
బీసీ నేతల ఖాళీలను బీసీలతోనే..
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన నాయకులు. వారు ఖాళీ చేసిన స్థానాలను వారి సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే భర్తీ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా ఆయా వర్గాలలో వ్యతిరేకత రాకుండా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గ కూర్పు సమతౌల్యం దెబ్బతినకుండా ఉండటానికి బీసీ నాయకులకే కేబినెట్లో బెర్త్ కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
రేసులో ఆ ఇద్దరూ
మంత్రివర్గంలో తీసుకోబోయే కొత్త ముఖాలను బీసీ నేతలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ఆ నాయకుల మధ్యే పోటీ నెలకొంది. మొదటి నుంచీ ఇద్దరు నేతల పేర్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్లను కేబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ మొదటి నుంచీ వార్తలు వెలువడుతున్నాయి. పిల్లి సుభాష్.. శెట్టి బలిజ వర్గానికి చెందిన నాయకుడు. ఆయన స్థానాన్ని గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్తో భర్తీ చేస్తారని అంటున్నారు. మత్స్యకార (అగ్నికుల క్షత్రియ) వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని అదే వర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కుమార్తో భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు.
ఇద్దరూ సీనియర్లే..
పిల్లి సుభాష్ చంద్రబోస్.. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, విశ్వసనీయుడనే పేరుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో పనిచేశారు. వైఎస్ హాఠాన్మరణం అనంతరరం మంత్రిపదవిలో కొనసాగలేకపోయారు. రాజీనామా చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. వైఎస్ జగన్ ఆయనను శాసన మండలికి పంపించి ఉప ముఖ్యమంత్రిని చేశారు.
కృష్ణాజిల్లాకు మరో స్థానం..
జోగి రమేష్కు మంత్రివర్గంలోకి తీసుకుంటే.. కృష్ణాజిల్లాకు ప్రాధాన్యత ఇచ్చనిట్టువుతుంది. ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కేబినెట్లో ఎంపిక అయినట్టవుతుంది. జోగి రమేష్.. పెడన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 7,839 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ను ఓడించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. మూడుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో సీనియర్. ముమ్మిడివరం స్థానం నుంచి పోటీ చేసిన పొన్నాడ సతీష్ కుమార్.. 5,547 ఓట్ల తేడాతో టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిరాజుపై విజయం సాధించారు. రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
శాఖల మార్పనకూ ఛాన్స్?
కేబినెట్ విస్తరణ సందర్భంగా శాఖల్లో కూడా మార్పులు చేర్పులు చేయొచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఖాళీ చేసిన ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కేబినెట్ మంత్రిగా డిమోట్ చేసి, ఆ స్థానాన్ని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది.
Recommended Video
22వ తేదీన అనుకున్నా..
ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో కేబినెట్ విస్తరణ చేపట్టవచ్చని అంటున్నారు. 22వ తేదీన అమావాస్య మిగులు ఉండటం వల్ల 23వ తేదీన గురువారం నాటి ముహూర్తాన్ని ఖాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రావణ మాసం ఆరంభం అప్పటి నుంచే ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ ముహూర్త సమయాన్ని నిర్ధారించడానికి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తోన్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సలహాను తీసుకోవచ్చని అంటున్నారు.