కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించనున్నారు. వచ్చేనెల నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టదలిచిన బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇతర బిల్లులు, తీర్మానాలపై మంత్రివర్గంలో నిర్ణయాలను తీసుకుంటారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ..తమిళనాడులో వైఎస్ జగన్ భారీ కటౌట్: సీఎం పళనిస్వామి సహా
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రులు ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయం. ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్ లిస్ట్ నుంచి విశాఖ స్టీల్ప్లాంట్ పేరును తొలగించేలా అంత సులభం కాదనే అభిప్రాయం ఉంది. పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపితే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయడానికి గల సాధ్యసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చకు వస్తుందని సమాచారం.
తిరుపతిలో ఏర్పాటు కానున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంపైనా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్లో చర్చకు అవకాశం ఉంది. మూడు రాజధానులు, ఉగాది నుంచి విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. నాలుగు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడం, అదే ఊపును మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కొనసాగించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కేబినెట్లో ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు.