25న కేబినెట్: అమరావతి భూముల విచారణపైనే ఫోకస్? సిట్ బదులుగా సీబీఐకి
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 25వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, సంక్షేమ పథకాల సమీక్ష, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మరింత మందికి విస్తరించే అవకాశాన్ని మంత్రివర్గం పరశీలిస్తుందని చెబుతున్నారు.
అమరావతి భూములపై వాట్ నెక్ట్స్?
అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత.. ఎలాంటి ముందడుగు వేయాలనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న భూముల కుంభకోణం విషయంపై జగన్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టింది. దీన్ని నిలిపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తు కొనసాగించడంపై నాలుగు రోజుల కిందటే హైకోర్టు స్టే విధించింది. ఇక దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై మంత్రివర్గం చర్చించవచ్చని తెలుస్తోంది.
సిట్కు బదులుగా సీబీఐ
అమరావతి భూముల కుంభకోణంపై సిట్కు బదులుగా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే అంశంపై మంత్రివర్గం చర్చించవచ్చని సమాచారం. కేంద్రం పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థ కావడం వల్ల సీబీఐకి ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాతే.. ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు. అమరావతి భూముల కుంభకోణంలో వెనక్కి తగ్గకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసిస్తున్నారని తెలుస్తోంది.
కొత్త ప్రాజెక్టు.. పథకాలు..
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మరి కొన్ని సంక్షేమ పథకాల గురించి ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్యను మరింత పెంచాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల పరిధిని మరింత పెంచడం ద్వారా కొత్త లబ్దిదారులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించేలా మంత్రివర్గంలో తీర్మానాలు చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు. విజయదశమి నాటికి విశాఖపట్నానికి తరలి వెళ్లాలని ప్రభుత్వం ఇదివరకే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
Recommended Video
నెలరోజులే గడువు..
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయం. కరోనా వైరస్ వల్ల నెలకొన్న సంక్షోభ పరిస్థితులు లేకపోయి ఉంటే.. ఈ పాటికి సచివాలయం అమరావతి నుంచి విశాఖకు తరలివెళ్లి ఉండేదనే అంటున్నారు. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే అవకాశాలు లేవు. ఎన్నిరోజులు పడుతుందనేది కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో సచివాలయం తరలింపును ఆపేయడం మంచిదికాదని వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. విజయదశమికి మరో నెలరోజుల గడువు మిగిలి ఉండటంతో తరలింపు అంశం ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు.