4న ఏపీ కేబినెట్ భేటీ: చర్చకొచ్చే అంశాలు ఇవే: సర్కులర్: స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం కుదిరింది. వచ్చేనెల 4వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రులు సమావేశమౌతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ దీనికి సంబంధించిన సర్కులర్ను కొద్దిసేపటి కిందటే జారీ చేశారు. కేబినెట్లో చర్చకు వచ్చే అంశాలకు సంబంధించిన అంశాలు, హ్యాండ్బుక్స్, టేకవే పాయింట్లను రెండురోజుల ముందుగానే మంత్రులకు అందజేస్తామని పేర్కొన్నారు.
న్యాయపోరాటాలపై..
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటోన్న న్యాయపరమైన అంశాలు, న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం, దీనికి సంబంధించిన ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు రావచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ వైఎస్ జగన్.. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేకు లేఖ రాయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రులు చర్చిస్తారని చెబుతున్నారు. అలాగే- హైకోర్టు ఇచ్చిన స్టేలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ల స్థితిగతులు కేబినెట్ సమక్షానికి వస్తాయని సమాచారం.
సంక్షేమ పథకాలపై సమీక్ష..
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీ సందర్భంగా సమీక్షిస్తారని అంటున్నారు. వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, నాడు-నేడు వంటి పథకాల అమలు తీరును మంత్రులు సమీక్షిస్తారని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు, డెలివరీ వ్యవస్థల్లో ఏవైనా లోటుపాట్లు తలెత్తి ఉంటే.. వాటిని వెంటనే సవరించేలా నిర్ణయాలను తీసుకుంటారని సమాచారం. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల ముసాయిదాలపైనా ఆ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే అంశం కూడా ఈ సందర్భంగా మంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, ఆయా పార్టీల నేతల అభిప్రాయాలు, దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశం మంత్రివర్గంలో చర్చకు వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో చర్చించిన తరువాతే.. ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
భూముల కేటాయింపుపై..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కేటాయించాల్సిన భూములపై మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కైనెటిక్ గ్రీన్ ముందుకు రావడం, లంబోర్గిని భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ను నెలకొల్పడానికి సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ సంస్థకు ఇవ్వాల్సిన రాయితీలు, భూముల కేటాయింపుపై చర్చిస్తారని అంటున్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు నిధులను రాబట్టుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు-గోరకల్లు ప్రాజెక్ట్.. వంటి అంశాలన్నీ మంత్రివర్గం ముందుకు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.