ఈ నెల 11న అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ- అజెండాలో అన్నీ కీలక అంశాలే ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత ఈ నెల 11న సమావేశం కాబోతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతుండటంతో మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. దీంతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం రూపంలో చాలా రోజుల తర్వాత వీరంతా ఒక చోట సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో చర్చించాల్సిన పలు కీలక అంశాలు పెండింగ్ లో ఉండటంతో కేబినెట్ సమావేశం నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా .. గోదావరిపై 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్
ఈసారి కేబినెట్ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజధాని మార్పు, ఎన్నికల కమిషనర్ వ్యవహారం, కరోనా వ్యాప్తితో పాటు పలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మండలి వ్యవహారం, పలు కీలక బిల్లులు, కొత్త సంక్షేమ పథకాలతో పాటు ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరుతెన్నులపైనా కేబినెట్ చర్చించబోతోంది.
ప్రస్తుతం వెలగపూడిలోని సచివాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూడు, నాలుగు బ్లాక్ లు మూసేశారు. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని భావిస్తున్నారు. సచివాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కేబినెట్ భేటీ నిర్వహణ సందర్భంగా హాజరయ్యే మంత్రులకు ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.