రాజధాని: 2వేల ఎకరాల్లో కార్యాలయాలు, వేలానికి 5వేల ఎకరాలు
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి తీసుకునే 35 వేల ఎకరాల్లో 5 వేల ఎకరాలను భూమిని వేలం వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిధుల సమీకరణలో భాగంగా ఆ భూమిని వేలం వేయనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణం, కీలక భవనాల నిర్మాణాలకు స్థలాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది.
రాజధాని నిర్మాణ స్థలం ఖరారుచేయగా, భవనాల నిర్మాణానికి స్థలం గుర్తింపుపై ఒక స్పష్టత వచ్చింది. దీంతో ఎకరం రూ. 15 కోట్ల లెక్కన రూ. 75 వేల కోట్ల ఆదాయాన్ని సమీకరించుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. త్వరలోనే ఈ ప్రాంతాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.
మొత్తం రాజధాని కోసం దాదాపు 35 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించగా, అందులో ఎనిమిది వేల ఎకరాల వరకు అభివృద్ధి చేసి మిగతా భూమిని అక్కడివారికి ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం అంచనా. మరో 15వేల ఎకరాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుంది. మిగిలిన ఏడు వేల ఎకరాల్లో ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య అవసరాలు, రోడ్లు, పార్కులు, ఇతర కీలక నిర్మాణాలకు కేటాయింపులు చేయనున్నారు.
ఇందులోనే దాదాపు ఐదు వేల ఎకరాల భూమిని వేలం ద్వారా అమ్మాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. కీలక రాజధాని ప్రాంతంలో ఉన్న భూమిని వేలం వేయడం ద్వారా ఎక్కువ నిధులు సమకూరే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఇలా ఉండగా, సర్కారు పాలనకు సంబంధించిన కీలక భవనాల నిర్మాణంపై కూడా ప్రాథమిక డిజైన్లు సిద్ధమయ్యాయి. ఇవన్నీ కృష్ణానదికి ఆనుకునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పటికే రాజధానికోసం గుర్తించిన గ్రామాల్లోని ఉద్దండరాయపురం, వెంకటాయపాలెం, రాయపూడి వంటి మండలాల్లోని కృష్ణా తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లోనే ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో రాజధాని భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు.
ఈ ఎనిమిది కిలోమీటర్ల తీరంలోని నాలుగు కిలోమీటర్ల పరిధిలో శాసనసభ, సచివాలయం, రాజభవన్, ప్రభుత్వ శాఖలకు భవనాలు లాంటివి నిర్మిస్తారు. మిగిలిన నాలుగు కిలోమీటర్ల పరిధిలో వ్యాపార సముదాయాలు, కళాపోషణకు అవసరమైన నిర్మాణాలు చేపడతారు.
నాలుగు కిలోమీటర్లలో తీరం వెంబడి పార్కులు, ఉద్యానవనాలు, పిక్నిక్ స్పాట్లు, స్విమ్మింగ్పూల్ వంటి ప్రజలకు ఉల్లాసాన్ని కలిగించే నిర్మాణాలను చేపట్టాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలకు, కళాత్మక నిర్మాణాలకు మధ్య ఉన్న రోడ్డును రాజ్పథ్గా రూపొందించాలని, ఆ ప్రాంతాన్ని సెక్యూరిటీ జోన్గా మలచాలని కూడా ప్రాధమికంగా నిర్థారించారు.
నదికి అవతలివైపు ఉన్న కృష్ణా జిల్లాలో కూడా కిలోమీటరు వెడల్పుతో నిర్మాణాలను చేపట్టే ఆలోచనకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. సచివాలయం, రాజభవన్, శాసనసభల నిర్మాణాలకు పదేసి ఎకరాల చొప్పున సరిపోతుందని, మంత్రులు, అధికారులు, శాసనసభ్యుల కోసం నిర్మించే టవర్లకు కూడా పెద్దగా స్థలం అవసరం ఉండకపోవచ్చునని, వంద ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టవచ్చునని అధికారులు అంటున్నారు.
రెండు రంగాలుగా నిర్మించే ప్రభుత్వ, కళాత్మక నిర్మాణాలను ఎవరు నిర్మించాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, 35 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పటివరకు 4500 ఎకరాల సేకరణ జరిగింది.
అన్ని ప్రాంతాల ప్రజల నుంచి సహకారం అందుతోందని, కేవలం పెనుమాక, తాడేపల్లి వంటి కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు అంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 1.10 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, తక్షణ సాయంగా 10 వేల కోట్ల రూపాయలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.