వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా: చివరి నిమిషంలో: ఇక కేబినెట్ భేటీ తరువాతే?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. చిట్ట చివరి నిమిషంలో ఆయన షెడ్యూల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్ దేశ రాజధానికి వెళ్లట్లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. ఇక ఇప్పట్లో ఆయన ఢిల్లీకి వెళ్లలేకపోవచ్చని తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన నిర్వహించబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తరువాతే ఢిల్లీ పర్యటనను షెడ్యూల్ చేయవచ్చని అంటున్నారు.
తప్పుడు వార్తలు రాస్తే జైలుకే... మీడియా జీవోపై తేల్చేసిన హైకోర్టు- జగన్ సర్కార్ కు భారీ ఊరట...
చివరి నిమిషంలో వాయిదా..
నిజానికి- ఈ ఉదయం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్తో భేటీ కావాల్సి ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగతి, వాటి ఖర్చు వివరాలు వంటి అంశాలపై గజేంద్రసింగ్ షెఖావత్కు ఓ నివేదిక అందజేయాల్సి ఉంది.
ఇదీ షెడ్యూల్..
సాయంత్రం 4:45 నిమిషాలకు కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలవాల్సి ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో శాసన మండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టడం, రాష్ట్రానికి బొగ్గు గనుల బ్లాకులను కేటాయించడం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి అప్పగించాల్సిన బొగ్గు గనులు వంటి అంశాలపై ఆయనతో చర్చించాల్సి ఉంది. రాత్రి 9 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉంది.
హైకోర్టు తీర్పులు.. రాజధాని తరలింపు..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, హైకోర్టు తీర్పులు వంటి అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం వంటి అంశాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా అమిత్ షా వద్ద ప్రస్తావించాల్సి ఉంది. అమిత్ షాతో భేటీ అనంతరం రాష్ట్రానికి తిరిగి రావాల్సి ఉంది. దీనితోపాటు ఈ నెల 5వ తేదీన ప్రతిపాదిత మంత్రివర్గ సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టాలనుకున్న అంశాన్ని కూడా అమిత్షానకు వివరించాల్సి ఉందని అంటున్నారు.
అమిత్ షా అందుబాటులో లేకపోవడం వల్లేనా..
దేశ రాజధానిలో ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ను సైతం ఖరారు చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీనికి గల స్పష్టమైన కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. గజేంద్ర సింగ్ షెఖావత్, ప్రహ్లాద్ జోషి అందుబాటులో ఉన్నప్పటికీ.. అమిత్ షా ఢిల్లీలో ఉండట్లేదనే సమాచారం రావడం వల్లే వైఎస్ జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని ప్రాథమిక సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు.
కేబినెట్ భేటీ తరువాతే..
ఈ నెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ సమావేశం తరువాతే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తారని అంటున్నారు. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందున.. ఆ లోగా ఢిల్లీకి వెళ్లి రావచ్చని చెబుతున్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని మార్చాలనుకుంటున్న నేపథ్యంలో తరువాతి మంత్రివర్గ సమావేశాన్ని అక్కడే నిర్వహించ వచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న కారణంగా..కేబినెట్ భేటీ విశాఖలో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి.