ఏపీ మహిళా కమిషన్ లోగో ఇదే: ఆవిష్కరించిన వైఎస్ జగన్:
అమరావతి: ఏపీ మహిళా కమిషన్ కోసం కొత్తగా ఓ లోగోను రూపొందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ లోగోను ఆవిష్కరించారు. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ భవన సముదాయంలోని తన ఛాంబర్ లో ఈ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజా, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. సమక్షంలో వైఎస్ జగన్ ఈ లోగోను ఆవిష్కరించారు.
మహిళా కమిషన్ కు ఇప్పటిదాకా ఎలాంటి లోగో లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా దీన్ని డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను ముద్రించారు. దాని మీద మహిళలకు సంరక్షణ కల్పించేలా రెండు హస్తాలను ప్రచురించారు. ఆ హస్తాల మీద.. మహిళల నీడను పొందుపరిచారు. ఇకపై ఈ లోగో అధికారికంగా కొనసాగుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మహిళల భద్రత కోసం అనేక చర్యలను తీసుకుంటున్నట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇందులో భాగంగా- ఏపీ దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గత అయిదేళ్ల కాలంలో ఏపీ మహిళా కమిషన్ దాదాపు నిద్రావస్థలో కొనసాగిందని, ఇకపై అలాంటి దుస్థితిని తాము రానివ్వబోమని అన్నారు.
మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఆయా హెల్ప్ లైన్ సెంటర్ల నంబర్లపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించడానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను మహిళా కమిషన్ తరఫున చేపట్టినట్లు వివరించారు. హెల్ప్ లైన్ కేంద్రాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని సూచించారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న నాలుగు అత్యాచార ఉదంతాలు.. ఏపీ దిశ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకుని రావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయని అన్నారు.