ఇక విద్యా వాలంటీర్ల దిశగా: గ్రామాలకు మెరికెల్లాంటి నగర విద్యార్థులు: నెలలో ఐదు రోజులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం.. మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం అది. పల్లె సీమల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచడానికి ఉపయోగపడేలా ఈ పథకం కోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పట్టణ, నగర ప్రాంతాల విద్యార్థులతో అనుసంధానించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించడంతో పాటు పోటీ పరీక్షల దిశగా వారిని సన్నద్ధులను చేయడానికి ఈ పథకం ఉపకరిస్తుందని చెబుతున్నారు.
విద్యా వలంటీర్ల వ్యవస్థ..
గ్రామ వలంటీర్ల తరహాలోనే విద్యా వలంటీర్ల వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యా వలంటీర్లకు ఎలాంటి గౌరవ వేతనాలు ఉండబోవు. వారు స్వచ్ఛందంగా తమ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తోన్న సమాచారం. ప్రస్తుతం గ్రామ వలంటీర్లకు ప్రతినెలా 5000 రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా రూపు దిద్దుకుంటోన్న విద్యా వలంటీర్ల వ్యవస్థ అచ్చం దీన్నే పోలి ఉంటుందని, వేతనాలు మాత్రం ఉండకపోవచ్చని సమాచారం. గ్రామీణ పాఠశాల విద్యార్థుల దశ దిశలను మార్చివేసేలా ఈ పథకంపై కసరత్తు చేస్తుందని అంటున్నారు.
నెలలో అయిదు రోజులు..
గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థుల్లో అద్భుత ప్రతిభ ఉన్నప్పటికీ.. ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఆశించిన స్థాయిలో లేకపోవడం, పోటీ పరీక్షల్లో పట్టణ, నగర స్థాయి విద్యార్థులతో పోల్చుకుంటే ఒకింత వెనుకంజలో ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. గ్రామీణ విద్యార్థులను కూడా పోటీ పరీక్షల దిశగా సన్నద్ధులను చేయడానికి, ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా- పట్టణ, నగరాలకు చెందిన ఉన్నత స్థాయి చదువులను అభ్యసించే విద్యార్థులు ప్రతి నెలా కనీసం అయిదు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామీణ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి విద్యార్థులతో స్వచ్ఛందంగా ఒక రోజంతా తరగతులను బోధించాల్సి ఉంటుంది.
కళాశాలల వారీగా పేర్ల నమోదు..
విద్యా వలంటీర్ల నియమాకం కోసం ప్రభుత్వం ఎంపిక చేసుకున్న కళాశాలలు, విద్యాసంస్థల వారీగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆయా కళాశాల్లో మెరికెల్లాంటి విద్యార్థులను ఎంపిక చేసి, వారిని గ్రామీణ పాఠశాలల్లో వలంటీర్లుగా నియమించే దిశగా చర్యలు తీసుకుంటారు. కళాశాల్లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేసి, వారు కోరుకున్న గ్రామాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం సంకల్పిస్తోందని అంటున్నారు. గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఆ రోజుకు అవసరమైన ఖర్చు, రవాణా సౌకర్యాన్ని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది.
నగర విద్యా వ్యవస్థపై అవగాహన..
పట్టణ, నగర ప్రాంతాల విద్యార్థులు తాము ఎంచుకున్న గ్రామీణ పాఠశాలకు నెలలో ఓ అయిదురోజుల పాటు సందర్శించి, విద్యార్థులకు సరికొత్త పాఠ్యాంశాలను, నగర వాతావరణాన్ని వివరించేలా చేయడం, పోటీ పరీక్షల తీరు తెన్నులు ఎలా ఉంటాయనే విషయాన్ని వివరించడం దీని ముఖ్య ఉద్దేశం. నగరాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అక్కడి విద్యా విధానాల గురించి తెలియజేయడం వల్ల గ్రామీణ విద్యార్థుల్లో ఓ అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు. పట్టణ, నగర ప్రాంతాల విద్యార్థులు గ్రామీణ విద్యార్థులను కలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.