ఐక్యరాజ్యసమితి సదస్సులో...తెలుగులో చంద్రబాబు తొలిపలుకులు:ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శం
Recommended Video
న్యూయార్క్:"ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారిందని, ఇది ప్రపంచానికే ఆదర్శం"...అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించారు.
ఎన్నారైలూ!..మీరంతా టిడిపికి ఓటు వేయండి...మా పార్టీకే ప్రచారం చేయండి:అమెరికాలో చంద్రబాబు పిలుపు
ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై సిఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలోని తొలిపలుకులు తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
అందరికీ...నమస్కారం
ఐక్యరాజ్యసమితి వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగం తెలుగులో ప్రారంభిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు. ఎపిలో ప్రకృతి సేద్యం పురోగతి...అమలు తీరును వివరించారు. ‘అమ్మ జన్మనిస్తే.. భూమాత ఆహారం నుంచి అన్నీ ఇస్తుంది...మనం కృత్రిమ పద్దతులలో సాగు ద్వారా భూమిని పూర్తిగా కలుషితం చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
కృత్రిమం...ప్రమాదకరం
రసాయన ఎరువులతో పండించిన పంటలతో ప్రజలు అందరం ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్తో పెట్టుబడి తగ్గడమే కాకుండా దిగుబడులు పెరుగుతాయని చంద్రబాబు వివరించారు. కాలక్రమంలో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వ్యవసాయం వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో...నూరుశాతం
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి ఎపి కేంద్రంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లలోనే రాష్ట్రంలో వందశాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఎపిలో...గ్లోబల్ సెంటర్
ఇదిలావుండగా ప్రకృతి సేద్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిపై అంతర్జాతీయ సంస్థలు కితాబిచ్చాయి. జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని ఐసీఆర్ఏఎఫ్కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ డీజీ టోనీ సైమెన్స్ అన్నారు. 30 దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ...ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తోందన్నారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందనే ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. ఏపీలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటైనా ఆశ్చర్యం లేదని...తాము కూడా ఎపిలో పరిశోధనలపై ఆసక్తిగా ఉన్నామని టోనీ సైమెన్స్ చెప్పారు.