దేశమంతా తిరిగినా: జీవీఎల్, మోడీ బాధితుడు.. జోషి సంఘీభావంతో మోడీకి బాబు షాక్!
Recommended Video
అమరావతి: రాజకీయం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు బుధవారం ఆరోపించారు. అమరావతి అంటే అవినీతి అని వినిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పరపతి దేశ రాజకీయాల్లో క్షీణించిందన్నారు.
రాజధాని భ్రమలను చంద్రబాబు ఢిల్లీ మోసుకొచ్చారన్నారు. ఆయన చేస్తున్న వాదనలో వాస్తవం, చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదన్నారు. దేశమంతా తిరిగినా చంద్రబాబుకు మద్దతు దొరకదన్నారు. చిన్నాచితక నేతలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు.
పార్లమెంట్ మెట్లకు నమస్కరించి సెంట్రల్ హాల్కు బాబు, కాంగ్రెస్-బీజేపీ మినహా..
72 పేజీల నివేదిక ఇస్తున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మంగళ, బుధ వారాలు వివిధ పార్టీ నేతలతో భేటీ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోను బాబు భేటీ అయ్యారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయంగా ఏపీకి రావాల్సింది, కేంద్రం ఇచ్చిన దానిని వివరిస్తూ రూపొందించిన 72 పేజీల నివేదికను వారికి అందిస్తున్నారు.
ఇదీ చంద్రబాబు విజ్ఞప్తి
చంద్రబాబు అందిస్తున్న నివేదిక ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వలె ఏపీకి కూడా పరిశ్రమలకు రాయితీ, హోదా ఇవ్వాలని చెబుతున్నారు. యూపీఏ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని జత చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,780 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం నుంచి ఇంకా 2,568 కోట్లు రావాల్సి ఉంది. రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నా రూ.3,979 కోట్లు మాత్రమే ఇచ్చారు. భూ సమీకరణలో రూ.50 వేల కోట్ల విలువైన 33 వేల ఎకరాలను రైతులు ఇస్తే కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్రం రూ.11,600 కోట్ల విలువైన భూములు ఇస్తే కేంద్రం ఇచ్చింది మాత్రం రూ.138 కోట్లు. కడపలో ఉక్కు పరిశ్రమ. 200 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల అమరావతి-అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఏర్పాటుకు తొలుత అంగీకరించినా ఇప్పుడు దానిని 100 మీటర్లకు కుదించి 4 లేన్లకు తగ్గించారని నివేదికలో పేర్కొన్నారు.
దేశాన్ని పాలించే హక్కు కోల్పోతోంది
ఏపీ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తే బీజేపీకి లేని బాధ, దురద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎందుకని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. విజయసాయి ముఖ్యమంత్రిపై సభాహక్కుల నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ దేశాన్ని పాలించే హక్కును కోల్పోతోందన్నారు. గందరగోళం నడుమ లోకసభ పదేపదే వాయిదా పడుతోందని, లోకసభనే నడపలేని వారు దేశాన్ని ఏమి పాలిస్తారన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలకు వివరించేందుకు ముఖ్యమంత్రి వెళ్లడం బీజేపీకి కనువిప్పు అవుతుందన్నారు.
మోడీ దేశంలోనే పిరికిపంద
ప్రధాని మోడీ దేశంలోనే అత్యంత పిరికిపంద అని మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడారు. ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని చేస్తే కుదరదని, బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుందని, పీఎంవోను సైతం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రలోభపెడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయన్నారు.
మీ పార్టీ బాధితుడిని, మోడీ బాధితుడు
మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబు పలువురు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ సెంట్రల్ హాల్లో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. జోషీని చూసిన చంద్రబాబు నవ్వుతూ నమస్కరించగా జోషీ ఆయన చేతులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నేను మీ ప్రభుత్వ బాధితుడిని అని జోషితో అన్నారు. దానికి పక్కనే ఉన్న విలేకరి వెంటనే అందుకుని ఈయన మోడీ బాధితుడు అన్నారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
జోషి సంఘీభావం
ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని చంద్రబాబు వివరించిన అనంతరం జోషి మాట్లాడారు. మీ బాధను తాను అర్థం చేసుకోగలను అన్నారు. ఏపీకి జోషీ సంఘీభావం ప్రకటించడంతో బీజేపీలో ఉన్న అసంతృప్తి బయటపడినట్టు అయిందని కొందరు నేతలు అంటున్నారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (బీజేపీ)తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హర్దీప్ మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి చాలా విన్నానని, నిజానికి తాను ఆయన అభిమానినని పేర్కొన్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మరో మంత్రి విజయ్ గోయల్, బీజేపీ ఎంపీలు సాక్షి మహరాజ్, పరేశ్ రావల్, హేమమాలిని, తెరాస ఎంపీలు కవిత, జితేందర్ రెడ్డి తదితరులను కూడా కలుసుకున్నారు.