గాలి ఇంటికి వెళ్లిన మంత్రి: చంద్రబాబు ఏం చేస్తారు ?
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇప్పుడు కమలనాథులు, ఆంధ్రప్రదేశ్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అమరావతి: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇప్పుడు కమలనాథులు, ఆంధ్రప్రదేశ్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొహమాటానికి గాలి ఇంటికి వెళ్లి ఇప్పుడు మంత్రి చిక్కుల్లో పడ్డారా ? అంటే సమాధానం చిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు బళ్లారీలో జరిగే ఓ కార్యక్రమంలో హాజరుకావాలని రెండు నెలల క్రితమే నిర్ణయించారు. రెండు నెలల క్రితమే ఖరారైన ఆ కార్యక్రమానికి హాజరుకావడానికి గత వారంలో మంత్రి మాణిక్యాలరావు బళ్లారి వెళ్లారు.
కార్యక్రమం పూర్తి అయిన తరువాత మంత్రి మాణిక్యాలరావు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే రైలు రావడానికి ఇంకా ఒక గంట సమయం ఉండటంతో ఆయన బసచేసిన అతిథిగృహానికి వెళ్లారు. మాణిక్యాలరావు బళ్లారీ వచ్చిన విషయం కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారీ ఎంపీ (బీజేపీ) శ్రీరాములకు తెలిసింది.
అంతే వెంటనే మంత్రి మాణిక్యాలరావుకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్లాలని, ఇంత దూరం వచ్చి మమల్ని కలవకుండా వెలితే ఎలా అని శ్రీరాములు అడిగారని సమాచారం. వెంటనే శ్రీరాములు మంత్రి మాణిక్యాలరావు ఉన్న అతిథిగృహానికి వెళ్లారు.
స్వయంగా శ్రీరాములు వెళ్లడంతో మంత్రి మాణిక్యాలరావు కాదనలేక శ్రీరాములు ఇంటికి వెళ్లారు. అక్కడ టీ తాగుతున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములు ఇంటికి వెళ్లారు. అన్నా మా ఇంటికి వచ్చి మా బిడ్డను ఆశిర్వధించాలని గాలి మంత్రి మాణిక్యాలరావుకు మనవి చేశారు.
అదే సమయంలో సెంటిమెంట్ ను కాదని చెప్పలేక మంత్రి మాణిక్యాలరావు గాలి ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను ఆశీర్వదించారు. మరసటి రోజు విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశానికి మాణిక్యాలరావు హాజరైనారు.
మంత్రివర్గ సమావేశం ముందే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు గాలి ఇంటికి ఎలా వెళ్లారు ? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిందని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతలూ ఎవ్వరూ గాలి ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు ఎవ్వరూ హాజరుకాలేదు. అయితే రెండు నెలల క్రితం అనుకోకుండా నిర్ణయించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి మాణిక్యాలరావు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారని టీడీపీ, బీజేపీ నాయకులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.
మంత్రి మాణిక్యాలరావు గాలి ఇంటికి వెళ్లిన విషయం ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెవిన వేశారని తెలిసింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని సంకీర్ణప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు మీద సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.