బిజీ బిజీగా సాగనున్న నేటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన...రాహుల్ తో సహా పలు పార్టీల దిగ్గజాలతో వరుస భేటీలు
న్యూఢిల్లీ:ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకం కానుంది. బిజెపిపై సమరశంఖం పూరించాక వచ్చే ఎన్నికల మహా సంగ్రామానికి ఆ పార్టీ ప్రత్యర్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చే అతి ముఖ్యమైన ఘట్టానికి చంద్రబాబే నేటి తన పర్యటనలో నాంది పలకనున్నారు. ఇందులో భాగంగా అనేక అరుదైన భేటీలకు శ్రీకారం చుడుతున్నారు.
'జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం' అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు నడుంబిగించిన చంద్రబాబు 20 ఏళ్ల తరువాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడంతో సహా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి వంటి వివిధ పార్టీల ముఖ్య నేతలతో కీలక భేటీలు జరపనున్నారు.
బిజెపి వైరిపక్షాలకు...సంధానకర్త
బిజెపిపై తిరుగులేని యుద్దం ప్రకటించిన టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిపై విజయభేరీ మోగించేందుకు జాతీయ స్థాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ధీటైన కూటమిని కూడగట్టే ప్రక్రియలో తానే సంధానకర్త పాత్ర పోషించనున్నారు. భవిష్యత్ మహా సంగ్రామంలో పాల్గొనబోయేవారిలో తమ పక్షం ఎవరో వైరి వర్గం ఎవరో తేల్చేయబోయే కీలక ఘట్టానికి నేడే శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యర్థితో పోలిస్తే బలంగా కనిపిస్తున్న బిజెపి కూటమిని ధీటుగా ఎదుర్కొనేందుకు పాత కాపైన కాంగ్రెస్ పార్టీలో కాలక్రమంలో చోటుచేసుకున్న బలహీనతలు సవరించి కొత్త ప్రాంతీయ పార్టీలను జోడించే సమన్వయకర్తగా విధులకు నేడే నాందిపలుకుతున్నారు.
చచ్చిపోయేలోపు టీటీడీ ఛైర్మన్ అవుతా...నా చిన్ననాటి కోరిక: హీరో శివాజీ
20 ఏళ్ల తరువాత...మళ్లీ
ఇందుకోసం తన గురువారం ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానుండటం గమనార్హం. సమకాలీన రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అధిపతి...అందునా కాంగ్రెస్ రాజకీయాలకు విసిగివేసారిన ప్రజల కోసం అనే నినాదమే ప్రధానంగా అవతరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు...ఇలా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో రాజకీయపరమైన సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1996 లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో చంద్రబాబు అప్పట్లో తొలిసారి సంప్రదింపులు జరిపారు.
ఢిల్లీలో...బిజీ బిజీగా బాబు
విజయవాడ నుంచి గురువారం ఉదయం బయలుదేరి వెళ్లే సిఎం చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టడంతోనే 12 గంటలకు నేరుగా శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతారు. శరద్ పవార్ తో తాజా రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళిక, దేశ రాజకీయాలపై ఆయనతో చర్చిస్తారు. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మధ్యాహ్నం 3.30కు చంద్రబాబు సమావేశమవుతారు. ఆయనతో తెలంగాణాలో పొత్తు రాజకీయాలు, సీట్ల సర్థుబాటు, ఎపి రాజకీయాలు తదిదర విషయాలపై చర్చిస్తారు. అనంతరం అజిత్ సింగ్, సీతారాం ఏచూరి వంటి నాయకులు వచ్చి కలుస్తారని తెలిసింది. ఆ తరువాత ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్లలో ఎవరో ఒకరు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని తెలిసింది.
పార్టీలో భిన్నవాదనలకు...వివరణ
ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడితో భేటీ తదిదర అంశాలపై సందిగ్థంతో ఉన్న టిడిపి సీనియర్, ముఖ్య నేతలను తాజా రాజకీయ పరిణామాలకు సన్నద్దం చేసే ప్రక్రియను చంద్రబాబు విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. బుధవారం తెదేపా సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తామెందుకు కాంగ్రెస్ తో జట్టు కట్టాల్సి వస్తుందో వివరిస్తూ..."తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకే ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పుడు కాంగ్రెస్ తో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు...బీజేపీతో అంతకు మించిన సమస్య ఎదురవుతోంది. తెలుగు వారికి అవమానం, అణచివేత రెండూ జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్తో కలిసి పనిచేయడంలో తప్పు లేదు. తెలుగు వారి ఆత్మగౌరవమే ఎన్టీఆర్ నినాదం. దీనికి ఎవరి వల్ల ఇబ్బంది తలెత్తినా...వారితో పోరాడతాం"...అని వివరణ ఇచ్చారు.
సంతృప్తి చెందేలా...సమాయత్తం
"ఆ క్రమంలోనే దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఢిల్లీ వేదికగా ప్రారంభిస్తున్నా. దేశం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయాయి. మోడీ హయాంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయి. ప్రస్తుతం నా ఆలోచన ఒక్కటే. భాజపా వ్యతిరేక శక్తులను ఒకే వేదిక మీదకు తీసుకురావడం...ప్రధాని కావాలనో, కూటమికి నాయకత్వం వహించాలనో అనుకోవడం లేదు. ఇది నా కోసం చేస్తున్నది అసలే కాదు...దేశాన్ని రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం"...అని పార్టీ కాంగ్రెస్ తో కలయికపై ఇంకా సందిగ్ధంతో ఉన్నవారిని సంతృప్తిపరిచేలా సమాధానం చెప్పారని సమాచారం.