తిరుమలపై మోడీ కుట్ర, ఆడియో టేపులో అడ్డంగా దొరికారు: బాబు సంచలనం, పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా..
విజయవాడ: మహానాడు వేదికపై నుంచి ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పనులు తక్కువ అన్నారు. వారు కలుషిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారన్నారు.
పవన్ కళ్యాణ్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే దీక్ష, ఏం చెప్పారంటే?
అలాంటి బీజేపీ విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి తనకు పడుతుందని వైసీపీ అధినేత వైయస్ జగన్కు పట్టుకుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి పెట్టి టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, విభజన హామీలు అమలు చేయలేదన్నారు. హోదా డిమాండుకు తెలంగాణ కూడా మద్దతిచ్చిందన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
బీజేపీ ప్రభుత్వం మనలను మోసం చేసిందని చంద్రబాబు అన్నారు. ఏ విషయంలోను సహకరించడం లేదన్నారు. మనం ఏమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెబుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదాకు తెలంగాణ పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చి మనకు మాత్రం ద్రోహం చేశారన్నారు. మనలను ఆదుకోవాల్సింది పోయి మాపై కుట్రలు చేశారన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్రంలో ఎన్టీఆర్ ఫ్రంట్లు ఏర్పాటు చేశారన్నారు.
టీటీడీపై మోడీ కుట్ర
తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై ప్రధాని మోడీ కుట్ర చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీటీడీని, వెంకన్నను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పురావస్తు శాఖ నుంచి టీటీడీకి నోటీసులు వచ్చాయన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకం రాగానే కేంద్రం వెంటనే వెనక్కి తగ్గిందన్నారు. ఎప్పుడో వెంకన్న నగలు పోయాయని ఇపపుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంకన్నతో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ కుట్రలో భాగమే తిరుపతి వెంకన్న ఆభరణాలపై దుష్ప్రచారం అన్నారు.
అందుకే యెడ్డీ రాజీనామా, మోడీ వల్ల ఎవరైనా బాగుపడ్డారా?
వ్యవసాయ రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. అందుకు కర్ణాటక ఉదంతమే నిదర్శనం అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందన్నారు. కానీ గత్యంతరం లేక యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అన్నారు. ఆయన పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. బుందేల్ ఖండ్ ప్యాకేజీ ఇస్తామని ఎందుకివ్వలేదన్నారు.
బీజేపీ అధికారంలోకి రాదు, ప్రాంతీయ పార్టీలదే చక్రం
రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూసిందని చంద్రబాబు అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని, ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయన్నారు. మోడీ కావాలని ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూస్తే బెబ్బులి పులిలా తిరిగి వస్తారని, కొండవీటి సింహంలా గర్జిస్తారన్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకవేదిక పైకి వచ్చాయంటే అది జాతి ప్రయోజనాల కోసం అన్నారు.
ఈవీఎంలపై చర్చ జరగాలి
ఈవిఎంల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఈవీఎంల విషయమై నేనే పోరాడానని చెప్పారు. దీనిపై చర్చ జరగాలన్నారు. కేంద్రం సుపరిపాలన అందించినా, ఏపీకి సహకరించినా ఇంకా మెరుగైన ఫలితాలు ఉండేవన్నారు. ప్రధాని మోడీ చర్యలతో పాలన గాడి తప్పిందన్నారు. కర్ణాటకలో మెజార్టీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం విడ్డూరమన్నారు. ఢిల్లీ - ముంబై కారిడార్కు లక్ష కోట్లు ఇచ్చారన్నారు. ఓ విగ్రహం నిర్మాణానికి రూ.3వేల కోట్లు ఇచ్చారన్నారు. అమరావతికి మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
మాపైకి కొందరిని రెచ్చగొడుతున్నారు
ఏపీకి అన్యాయం చేస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బ్యాంకింగ్ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు. ఇంతగా కరెన్సీ కొరత ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రశ్నిస్తున్న మాపై కొందరిని రెచ్చగొడుతున్నారని పవన్ కళ్యాణ్, జగన్లను ఉద్దేశించి అన్నారు. మోడీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందన్నారు.