పెట్టుబడులు, అమరావతిపై ఒప్పందాలు: బాబు చైనా పర్యటన, వెంట వీరే
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీన రాత్రి చైనా బయలుదేరనున్నారు. పెట్టుబడులు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయమై ఒప్పందాల విషయమై ఈ పర్యటనలో చర్చించనున్నారు.
చంద్రబాబు అండ్ కో ఈ నెల 25వ తేదీన ఢిల్లీకి వెళ్లనుంది. అక్కడి నుంచి చైనా బయలుదేరుతారు. 26వ తేదీ నుంచి 29 తేదీ వరకు వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. మొత్తం పదమూడు మంది వెళ్లనున్నారు. పెట్టుబడులపై పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.
చంద్రబాబు వెంట వెళ్తున్న బృందం పేర్లను సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. మంత్రులు నారాయణ, యనమల, ముఖ్య సలహాదారు పరకాలతో పాటు అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గణేశ్ బాబు, సీఎం చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఉంటారు.
వీరితో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్, సీఎం కార్యదర్శి ప్రధ్యుమ్న, రాజధాని అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్, ముఖ్య భద్రతాధికారి నాగేంద్రుడు సీఎంతో పాటు చైనాకు వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చింది.