ఓటుకు నోటు: చంద్రబాబు గొంతు పరీక్షకు అసెంబ్లీ స్పీచ్పై ఎసిబి
హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో జరిపినట్లు చెబుతున్న ఆడియో టేపులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గొంతును పోల్చి చూడడానికి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నిర్ణయించుకుంది. ఇందుకు గాను, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రసంగాలతో ఆడియో టేప్ గొంతును పోల్చి చూసి నిర్ధారించుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
స్టీఫెన్సన్తో చంద్రబాబు మొబైల్ ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపు సరైందేనని, అది ట్యాప్ చేసిన వాయిస్ కాదని, వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన విషయాలను ఒక దగ్గర చేర్చి గుది గుచ్చింది కాదని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే, గొంతును నిర్ధారించుకోవడానికి ఎసిబి చంద్రబాబుకు సమన్లు జారీ చేయవచ్చునని భావించారు. అయితే, చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో ఆడియో టేప్ మాటలను పోల్చు చూడాలని ఎసిబి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికతో నోటుకు ఓటు కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. తదుపరి చర్యల కోసం ఎసిబి చర్యలకు ఉపక్రమించింది. కేసును ఎసిబి కూడా దర్యాప్తు చేయవచ్చునని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది అవినీతి కేసుతో పాటు క్రిమినల్ కేసు కూడా అని ఎన్నికల కమిషన్ తెలిపింది.