సీఎం జగన్ చేతులమీదుగా దిశ యాప్ ఆవిష్కరణ, రాష్ట్రంలో 18 దిశ స్టేషన్లు: ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్లో 18 చోట 'దిశ' పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల రక్షణ కోసం 'దిశ' విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. ప్రతి పోలీసుస్టేషన్ మహిళామిత్రలా పనిచేస్తుందని స్పష్టంచేశారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.
సత్వర న్యాయం
దిశ కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తిచేసేందుకు యంత్రాంగాన్ని సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేస్తామని తెలిపారు. దిశ కేసుల్లో వారం రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టంచేశారు. బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఇందులో మరో ప్రశ్నకు తావులేదన్నారు.
7న యాప్ ఆవిష్కరణ
ఈ నెల 7వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘దిశ' యాప్ కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దిశ లాంటి కేసుల్లోనే కాకుండా మహిళలకు సంబంధించిన అన్నీ కేసుల్లో సత్వర న్యాయం జరిగేటట్టు కృషిచేస్తామని తెలిపారు. ఇందుకోసం పోలీసుశాఖలో మార్పులు తీసుకొస్తున్నామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
దిశ స్ఫూర్తిగా..
తెలంగాణలో నవంబర్లో దిశపై నలుగురు మృగాళ్లు పాశవికంగా లైంగికదాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు, మహ్మద్ ఆరిఫ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు కాల్పులు జరపడంతో ఆ నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం దిశ బిల్లు ప్రవేశపెట్టి.. చట్టం చేసిన సంగతి తెలిసిందే.