కోడెలతో సీఎస్ టక్కర్ భేటీ: 'లక్ష్యంతో చంద్రబాబు', దేనిపై చర్చించారంటే?
హైదరాబాద్: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పనితీరును వేగవంతం చేయాలని, వివిధ శాఖలను సమన్వయం చేసుకోవలసిన బాధ్యత సంస్ధదేనని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో చీఫ్ సెక్రటరీ టక్కర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలో నిర్వహించనున్న నేపథ్యంలో శాసనసభ భవనం పనులను వేగవంతం చేయాలని స్పీకర్ సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఒక లక్ష్యం మేరకు ఈ కార్పోరేషన్ను ఏర్పాటు చేసారని, వాటిని చేరుకునే దిశలో ముందడుగు వేయాలన్నారు. ఎవరు ఏ పని చేయాలన్న దానిపై స్పష్టత ఉండాలని అందుకు అవసరమైన ఎజెండా సిద్ధం చేయాలని సభాపతి డాక్టర్ కోడెల స్పష్టం చేసారు.
శనివారం శాసనసభలోని తన ఛాంబర్లో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సిఇఓ మరళీధర్, సిఓఓ సురేష్లతో స్పీకర్ కోడెల సమావేశమయ్యారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పూర్వపు పనితీరు, భవిష్యత్తు లక్ష్యాలపై సమీక్షించిన సభాపతి అధికారులకు దిశానిర్ధేశం చేసారు.
కార్పొరేషన్ వ్యవహారాలలో అందరినీ భాగస్వాములను చేయాలని, ప్రత్యేకించి ఎన్జిఓల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28,29 తేదీలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎజండా ఖరారుపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని సభాపతి ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రత్యేకించి తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందని భావిస్తే ఎంత మేరకైన నిధలు విరాళంగా ఇచ్చేందుకు దాతలు సిద్దంగా ఉన్నారని, అయితే వారు చేస్తున్న కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించినప్పుడే ఒకరిద్దరుగా, వారు తిరిగి పదులు, వందల సంఖ్యలో ముందుకు వస్తారని డాక్టర్ కోడెల అన్నారు.
విభిన్న ప్రాజెక్టులను పిపిపి విధానంలో చేపట్టటం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతామని, దీనిని చేపట్టేందుకు కార్పోరేషన్కు స్పష్టత కావాలని, ఎవరు ఏపని చేయాలన్నదే ఇక్కడ కీలకమని స్పీకర్ కోడెల వివరించారు.
గ్రామీణ ప్రాంతాలలో పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను, పట్టణ ప్రాంతాలకు సంబంధించి అయా నగర పాలక, పురపాలక సంస్ధల అధికారులను సమావేశపరచాలని, ఏ విభాగం ఏతీరుగా వ్యవహరిస్తామన్న దానిపై తనకు నివేదిక అందించాలని డాక్టర్ కోడెల అదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ను ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేసారని, ఒక మరుగు దొడ్ల నిర్మాణమే కాక, పరిశుభ్రత, పచ్చదనం వంటి అంశాలు కూడా మిషన్లో భాగమేనన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్కు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు.