విశాఖలో రాజధాని ఏర్పాటు దిశగా కీలక అడుగు: తరలివెళ్లేది సచివాలయం ఒక్కటే కాదు: డీజీపీ టూర్
అమరావతి: సాగర నగరం విశాఖపట్నంలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సచివాలయం కోసం అనువైన భవనాలను గుర్తించే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. తాజాగా- పోలీసు కార్యాలయాలను నెలకొల్పడానికి అవసరమైన భవన సముదాయాలను కోసం అన్వేషణ మొదలు పెట్టింది. దీనికోసం ఏకంగా- రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలించడం ఖాయమనే సంకేతాన్ని పంపించింది.
రెండురోజులు మకం వేసిన డీజీపీ
డీజీపీ గౌతం సవాంగ్ రెండురోజుల పాటు విశాఖపట్నంలో మకాం వేశారు. శుక్ర, శనివారాల్లో ఆయన విశాఖపట్నంలో గడిపారు. పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాల గురించి ఆయన అన్వేషణ కొనసాగించారు. పలు ప్రాంతాలను సందర్శించారు. పలుచోట్ల పర్యటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రుషికొండ సహా
తన రెండురోజుల పర్యటన సందర్భంగా గౌతం సవాంగ్.. విశాఖపట్నం శివార్లలోని రుషికొండ, ఆనందపురం, పెందుర్తి సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో గల ఖాళీ స్థలాల గురించి ఆరా తీశారు. ఖాళీ ప్రదేశాల్లో పోలీసు కార్యాలయాలను నిర్మించడానికి అవసరమైన, అనువైన పరిస్థితులపై జీవీఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రుషికొండ ఐటీ సెజ్ను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ నిర్మితమౌతోన్న ఐటీ టవర్-1, టవర్-2 పనులను పరిశీలించారు. పనులు ఎప్పట్లో పూర్తవుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులకు గౌతం సవాంగ్కు వివరించారు.
తొట్లకొండ గ్రేహౌండ్స్ కార్యాలయంలో
తొట్లకొండలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల సమీపంలో గల సింహపురి కాలనీని కూడా గౌతం సవాంగ్ సందర్శించారు. ఈ ప్రాంతంలో భూములు ఖాళీగా ఉన్నాయని జీవీఎంసీ అధికారులు ఆయనకు తెలిపారు. పోలీసు కార్యాలయాల నిర్మాణానికి అనువైనవా? కాదా? అనే విషయంపై డీజీపీ ఆరా తీసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్నీ డీజీపీ పరిశీలించారు. రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయాన్ని ఆనందపురంలో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అమరావతి ఉద్యమం కొనసాగుతోన్న వేళ..
సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించకూడదంటూ రాజధాని ప్రాంత రైతులు, తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు 200 రోజులను అధిగమించిన వేళ.. గౌతం సవాంగ్ ఆకస్మికంగా విశాఖపట్నంలో పర్యటించడం చర్చనీయాంశమైంది. పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనువైన భవనాల కోసమే ప్రత్యేకంగా ఆయన విశాఖలో మకాం వేయడం, ఒకరోజంతా పలు ప్రాంతాలను సందర్శించడం ఆసక్తి రేపుతోంది. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం, దానితోపాటుగా పోలీసు కార్యాలయాలు కూడా విశాఖకు తరలివెళ్లడం ఖాయమనే సంకేతాలను ఇచ్చినట్టయిందని అంటున్నారు.