కర్నూలులో ఘోరం: గర్భసంచిలో శిశువు తల.. మొండెం మాత్రం బయటికి: 80 కిలోమీటర్లు ట్రావెల్..నరకం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య రంగానికే మచ్చ తీసుకొచ్చేలా వ్యవహరించారు అక్కడి గైనకాలజిస్ట్. గర్భంలోనే కన్నుమూసిన ఓ శిశువును వెలికి తీసే ప్రయత్నంలో తలను కోసి వేశారు. తలను వేరు చేసి, మొండేన్ని బయటికి తీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత తల్లి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
బాధితురాలి పేరు శ్రీలక్ష్మి. కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం అలగనూరుకు చెందిన ఆమె ఏడునెలల గర్భిణి. పురిటినొప్పులు తీవ్రం కావడంతో ఆమెను నంద్యాలలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్..కడుపులోనే బిడ్డ మరణించినట్లు తెలిపారు. శిశువు మృతదేహాన్ని వెలికి తీయడానికి శస్త్ర చికిత్స చేశారు. గర్భసంచిలో తల ఇరుక్కుని పోవడం వల్ల శరీరం నుంచి వేరు చేశారు. తలను, మొండేన్ని వేరు చేశారు.
గర్భసంచిలో ఇరుక్కుని పోయిన తలను వెలికి తీయడంలో గైనకాలజిస్ట్ విఫలం అయ్యారు. తోటి డాక్టర్లు ప్రయత్నించినప్పటి సాధ్యం కాలేదు. పొరపాటు చోటు చేసుకుంటే తల్లి ప్రాణానికే ప్రమాదమని భావించిన డాక్టర్లు శ్రీలక్ష్మిని వెంటనే అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భసంచిలో శిశువు తల, పక్కనే మొండెంతో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితిని ఎదుర్కొందామె. కర్నూలు ఆసుపత్రిలో మరోసారి శస్త్ర చికిత్స చేశారు డాక్టర్లు. శిశువును తలను బయటికి తీశారు.
Recommended Video
ఈ ఘటన పట్ల శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ల నిర్వాకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు ప్రాణాలతో లేదని తమకు ముందుగానే తెలియజేశారని, అయినప్పటికీ.. మృత శిశువును వెలికి తీయడంలో గైనకాలజిస్ట్ అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ.. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన పట్ల కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకుంటామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.