డీఎస్పీ రవిబాబు: బిగుస్తున్న ఉచ్చు, 'పీకలు కోసే రౌడీలున్నారు'
వైజాగ్: రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డీఎస్పీ రవిబాబుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.మరో వైపు డిఎస్పీ రవిబాబు తమను బెదిరించి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
విశాకలో రౌడీషీటర్ గేదేల రాజు హత్య కేసుతో పాటు మాజీ ఎంపిపి పద్మలత మరణం వెనుక కూడ డీఎస్పీ రవిబాబు హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలన్నింటిపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరపనున్నారు.
గేదేల రాజు హత్య కేసు ఘటనలో డీఎస్పీ రవిబాబు శుక్రవారం నాడు విశాఖ పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి రవిబాబు నోరు తెరిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.
డిఎస్పీ రవిబాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
రెండు సుపారీలు, రెండు దారుణ హత్యలు. ఎక్కడా చిన్న ఆధారం లేదు. ఒక హత్య అయితే.. సహజ మరణంగా మరుగున పడిపోయింది. మరో హత్యలోనూ ఏవిధమైన క్లూ దొరకలేదు.ఈ రెండు ఘటనల వెనుక డీఎస్పీ రవిబాబు హస్తం ఉందని పోలీసులు గుట్టు విప్పారు. అయితే ఈ కేసులకు సంబంధించి న్యాయపోరాటం చేస్తానని డిఎస్పీ రవిబాబు చెబుతున్నారు. ఈ హత్యలు రవిబాబు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాలపై పోలీసుల సాక్ష్యాదారాలను సేకరించనున్నారు.
పీకలు కోసే రౌడీలున్నారని డీఎస్పీ బెదిరించారు
రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డీఎస్పీ రవిబాబుపై ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి బాధితులు వచ్చారు. తమకు పొలం అమ్ముతున్న రైతులను బెదిరించి.. రవిబాబు చెల్లెలి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. 2009లో తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వగా.. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని అడిషనల్ ఎస్పీకి వివరించారు. బాధితుల ఫిర్యాదు సేకరించిన ఎస్పీ.. విచారణ జరపాలని అనకాపల్లి డీఎస్పీకి ఆదేశించారు. చోడవరం ఎస్ఐ సూచనల మేరకు మధురవాడలో రవిబాబును కలిశామని ఈ సందర్భంగా బాధితులు చెప్పారు. పీకలు కోసే రౌడీలున్నారు.. భూమిని వదిలేయాలని రవిబాబు హెచ్చరించడంతో.. భయపడి ఊరికి వెళ్లిపోయామని బాధితులు వాపోయారు. రవిబాబు అరెస్ట్తో బాధితులు బయటకు వచ్చారు.
చిన్న పొరపాటుతో బట్టబయలైన హత్య కేసు
విశాఖకు చెందిన రౌడీషీటర్ గేదెల రాజు అదృశ్యమయ్యాడంటూ ఈనెల 7వ తేదీన విశాఖపట్నం న్యూ పోర్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది. అదేరోజు.. సబ్బవరం పరిధిలోని గాజువాక శివార్లలో కాలిపోయిన శవం గుర్తించారు. ఆ శవం గేదెల రాజుదే అని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి వైజాగ్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో యాక్టివాను సీజ్ చేశారు. విచారణలో యాక్టివా నడుపుతుంది రవి అని, ఇతడు వైసీపీ నేత, క్షత్రియభేరి పత్రిక ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజు వద్ద పని చేస్తున్నట్లు తేలింది.ఆ యాక్టివా గేదెల రాజుదిగా గుర్తించారు పోలీసులు. దీంతో.. ఈ నెల 13న రవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. అసలు గుట్టును తెలుసుకున్నారు. గేదెల రాజును ప్రస్తుతం ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రవిబాబు.. హత్య చేయించాడని తేల్చారు. రవి ఇచ్చిన సమాచారంతో ఆదర్శనగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పద్మ హత్య కేసు బయటకు రాకుండా ఉండేందుకే
పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే కూతురు పద్మకు విశాఖ ఏసీపీగా పనిచేసిన రవిబాబుకు వివాహేతర సంబంధం వుండేది. తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఏసీపీ రవిబాబు తనను మోసం చేశాడంటూ 2016లో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పద్మ హత్యకు కోటిరూపాయల సుపారీ మాట్లాడాడు రవిబాబు. ముందుగా 50 లక్షల రూపాయలు ఇచ్చి.. గేదెల రాజుతో హత్య చేయించాడు. అనుమానం రాకుండా గేదెల రాజు విషం కలిపిన ఆహారం తినిపించి పద్మను మర్డర్ చేశాడు. ఆ తర్వాత.. పద్మ అనారోగ్యంతో మరణించిందని అందరూ అనుకున్నారు.
గేదేల రాజు బ్లాక్ మెయిల్ భరించలేక హత్య
50 లక్షల రూపాయలు ఇవ్వాలని రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తెచ్చాడు. గేదెల రాజు బ్లాక్మెయిల్లో పద్మ హత్యకేసు తనమెడకు చుట్టుకుంటుందని భావించిన డీఎస్పీ రవిబాబు.. అతన్ని కూడా సుపారీ ఇచ్చి హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. తనకు సన్నిహితంగా ఉండే క్షత్రియభేరి పత్రిక ఎడిటర్, వైసీపీ నేత భూపతిరాజు శ్రీనివాసరాజుతో పనిపూర్తిచేయించాడని విశాఖ పోలీసులు ప్రకటించారు.ఈ రెండు ఘటనలకు సంబంధించి వైజాగ్ పోలీసులు సాక్షాలను సేకరిస్తున్నారు.