500లకుపైగా చీరలు!: ఏసీబీ వలలో మరో వందకోట్ల అవినీతి తిమింగలం
మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఏపీ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ మేడిపల్లి విజయరాజు నివాసంలో బుధవారం ఉదయం నుంచీ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు .
హైదరాబాద్/విజయవాడ: మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఏపీ దేవాదాయశాఖ సహాయ కమిషనర్ మేడిపల్లి విజయరాజు నివాసంలో బుధవారం ఉదయం నుంచీ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేవాదాయశాఖలో ఉన్న ఈ అధికారి దేవుడి సొమ్మును దోచేసి రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆరు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు విజయవాడ, హైదరాబాద్లోని ఆయన నివాసాల్లో పట్టుచీరలు చూసి నిర్ఘాంతపోయారు. గతంలో హైదరాబాద్, పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో విజయరాజు అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.
ఆయా ప్రాంతాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సోదాలు చేపట్టిన అధికారుల బృందం సుమారు రూ.30లక్షల విలువచేసే 563 పట్టుచీరలను ఆ అవినీతి అధికారి ఇంట్లో గుర్తించింది. ఇందులో ఒక్కో చీర ధర రూ.లక్ష నుంచి రూ.2లక్షలు ఉంటుందని సమాచారం.
దేవాదాయ శాఖలో ప్రస్తుతం సహాయ కమిషనర్గా ఉన్న విజయరాజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన అక్రమాస్తులను, భారీ సంఖ్యలో చీరలను కూడబెట్టినట్లు తెలుస్తోంది. విజయరాజు అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.