పోలవరంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఒడిశా...సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు
అమరావతి: పోలవరం ముంపు ప్రాంతాల గురించి ఒడిశా ప్రభుత్వం అనవసర వివాదం రేపుతూ న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.
పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ పర్యావరణ శాఖ జారీచేసిన ఆదేశాలను స్తంభింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏడాదికోసారి ఉత్తర్వులు జారీచేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం జారీ చేస్తున్న ఆ ఉత్తర్వులను నిలిపేయాలని ఒడిశా ప్రభుత్వం ఐఏ దాఖలుచేసింది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏని కొట్టేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
ఈమేరకు ఎపి ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో 220 పేజీల కౌంటర్ దాఖలుచేసింది. ప్రజాభిప్రాయసేకరణ జరుపకుండా పర్యావరణ అనుమతులు ఇచ్చారనే ఒడిశా వాదనలో నిజంలేదని పేర్కొంది. కేంద్ర పర్యావరణ అధికారులు అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించిన తర్వాతే పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించింది.
అలాగే 1994 పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన ప్రకారం ప్రజాభిప్రాయసేకరణను కూడా పూర్తిచేసినట్లు ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపింది. 2006 పర్యావరణ ప్రభావ మదింపు ప్రకటన పోలవరం ప్రాజెక్టుకు వర్తించకపోయినప్పటికీ ముంపును అడ్డుకునే కరకట్టల నిర్మాణంపై ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు ఎపి ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది.
అంతకుముందు ఇదే విషయమై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా...జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఉన్నాయని, ఆ కేసులను న్యాయస్థానాలు పరిష్కరించాల్సిన అవసరం లేదని అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం చెబుతోందని ఆంధ్రప్రదేశ్ వాదించింది.