ఉలిక్కి పడ్డ తూర్పు గోదావరి: శ్రీచక్ర ఆయిల్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. !
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీచక్ర ఆయిల్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు ప్రాథమిక సమాచారం. వంటనూనెను తయారు చేసే విభాగంలో చెలరేగిన మంటలు..క్షణంలో మిల్లు మొత్తాన్నీ చుట్టముట్టాయి. మండే స్వభావం ఉన్న వస్తువులు అధికంగా ఉండటం వల్ల అగ్నికీలలు శరవేగంగా వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని పేరా రామచంద్రాపురం శివార్లలో ఉంటుందీ శ్రీచక్ర ఆయిల్ మిల్లు. మూడు షిఫ్టుల్లో వంటనూనెలను తయారు చేస్తుంటారు. ఈ ఉదయం వంటనూనెల తయారీ విభాగంలో మంటలు అంటుకున్నాయి. వెనువెంటనే మిల్లు మొత్తాన్నీ చుట్టేశాయి. మొదట దట్టమైన పొగ వెలువడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పొగ వెలువడగానే ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు మిల్లును బయటికి వచ్చారని అంటున్నారు.
ఆ వెంటనే మంటలు చెలరేగి వంటనూనె తయారీ యూనిట్ సహా ప్యాకింగ్, డిస్పాచ్ విభాగాలకు వ్యాపించాయని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల ద్వారా మంటలను ఆర్పివేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
షార్ట సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చిన అనుమానిస్తున్నట్లు తెలిపారు. వంటనూనె తయారీలో వినియోగించే మండే స్వభావం ఉన్న వస్తువుల వల్ల అగ్నికీలలు త్వరితగతిన విస్తరించి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కార్మికులు ఎవరూ మిల్లులో లేరని, పొగ వెలువడిన వెంటనే ప్రమాదాన్ని శంకించి, బయటికి పరుగు తీశారని తెలిపారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఆస్తినష్టం భారీగా సంభవించింది.