వీడిన పాస్టర్ మర్డర్ కేసు మిస్టరీ...భక్తుడే హంతకుడు:నమ్మకద్రోహం
గుంటూరు:జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొలకలూరు పాస్టర్ హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. ఈ పాస్టర్ కు నమ్మకంగా ఉంటూ వీర భక్తుడిలా నటించిన యువకుడే డబ్బు కోసం తన స్నేహితులతో కలసి హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీంతో ఈ దారుణానికి పాల్పడిన నమ్మకద్రోహితో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి నుంచి దోపిడీ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు, నగదు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాస్టర్ ను హత్య చేసిన హంతకులు తెలివిగా ఆ మర్డర్ ను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో కేసును చేధించడం పోలీసులకు కష్టంగా మారింది. అయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...
భక్తుడిలా వచ్చి...నమ్మకంగా ఉంటూ...
గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన ఆరుంబాక రాజేష్ డిగ్రీ చదివాడు. క్రైస్తవ భక్తిపరుడిలా కనిపించే ఆరంబాక రాజేష్(37) తరుచూ ప్రార్థన చేయించకోవడం కోసమని అదే గ్రామానికి చెందిన పాస్టర్ ఉన్నం సుబ్బారావు(68) అలియాస్ డానియేల్ వద్దకు తరచూ వస్తుండేవాడు. కొలుకలూరులో ఒంటరిగా నివసించే పాస్టర్ సుబ్బారావుకు రాజేష్ మంచి నమ్మకస్థుడిలా మారడంతో పాస్టర్ ఇతడి చేతికే ఎటిఎం ఇచ్చి డబ్బులు తెప్పించడం, బ్యాంకులో డబ్బులు చేయించడం చేసేవాడు. అంతేకాదు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా చెబుతుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల పాస్టర్ తన పొలాన్ని అమ్మడంతో రూ.6 లక్షలు వచ్చాయి. వాటిని ఆయన రెండు బ్యాంక్ల్లోని తన ఖాతాల్లో భద్రపరుచుకున్న విషయం రాజేష్ కు తెలిసింది.
ఆ డబ్బు...కాజేయాలని ప్లాన్
పాస్టర్ బ్యాంకు అకౌంట్ లో ఉన్న రూ.6 లక్షలను ఎలాగైనా కాజేయాలని నిర్ణయించుకున్నాడు. అదే ప్లాన్ తో ఓ రోజు పాస్టర్ ఇంటివద్దకు వెళ్లి ప్రార్థన చేయించుకుంటున్నట్లు నటించి ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో అతని రెండు ఏటీఎం కార్డులు తస్కరించాడు. ఆ తరువాత తనకు ఆ ఎటిఎంల పిన్ లు తెలిసి వుండటంతో తన స్నేహితులైన కొలకలూరి ఆనంద్బాబు, సుద్దపల్లి పృధ్వీరాజ్ల సాయంతో పాస్టర్ అకౌంట్ నుంచి విడతల వారీగా రూ. 4,78,246లు డ్రా చేశారు.
అనుమానం...నిర్థారణ
అయితే తన అకౌంట్ నుంచి డబ్బు భారీగా విత్ డ్రా అయినట్లు పాస్టర్ సుబ్బారావుకు తెలిసింది. ఆ తరువాత అతడికి రాజేష్ పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఇక తన బండారం బైటపడుతుందని భయపడిన రాజేష్ డబ్బులు తాను చోరీ చేసిన విషయం అంగీకరించి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని బ్రతిమలాడుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత డబ్బు తిరిగి ఇచ్చినా, ఇవ్వకున్నా ఇక తమ బండారం బైటపడుతుందని అందుకే పాస్టర్ ను చంపేస్తే ఏ ఇబ్బంది ఉండదంటూ రాజేష్ తన స్నేహితులైన పొన్నకంటి పవన్కుమార్, వున్నం గోపిలతో కలిసి సమాలోచనలు జరిపి పాస్టర్ హత్యకు పథకం రచించాడు.
హత్య...చిత్రీకరణ
ఆ ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 23 వ తేదీ పాస్టర్ తన ఇంట్లో నిద్రిస్తుండగా రాజేష్, అతడి స్నేహితులు పాస్టర్ ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆ తరువాత నిందితులు ఎటువంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త తీసుకోవడంతోపాటు వృద్ధుడైన పాస్టర్ది సాధారణ మరణంలా కనిపించేట్లు చేయడంతో పోలీసులకు ఈ కేసు విచారణ పెద్ద సవాల్గా మారింది. అంతేకాదు పాస్టర్ హత్య విషయమై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిలో రాజేష్ కూడా ఉండటం గమనార్హం. ఆ తరువాత రాజేష్ తాను తస్కరించిన డబ్బులో రూ.3.40 లక్షలు పెట్టి ఒక స్థలం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో కొంత నగదును స్నేహితులకు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఈక్రమంలో పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గత కొంతకాలంగా పాస్టర్తో తరచూ సంప్రదింపులు చేసిన వ్యక్తులు, బ్యాంక్ ఏటీయం కార్డులతో డబ్బులు డ్రా చేసిన విధానాలు, ఆయా ప్రాంతాల్లోని సిసి కెమేరాల ఫుటేజ్ ఆధారంగా పరిశీలించి నిందితులపై నిఘూ పెట్టి విచారించడంతో మొత్తం కుట్ర అంతా బైటపడింది.
మర్డర్ మిస్టరీ...వివరించిన రూరల్ ఎస్పీ
గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు మీడియా సమావేశంలో పాస్టర్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన రాజేష్తో పాటు అతడికి సహకరించిన ఉన్నం గోపి, పొన్నెకంటి పవన్కుమార్, సుద్దపల్లి పృథ్వీరాజ్, కొలకలూరి ఆనంద్బాబును అరెస్టు చేసినట్లు ఎస్పి వివరించారు. నిందితుల నుంచి చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులు, రూ. 83 వేల నగదు, ఐదు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులు చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ వరదరాజు, డీఎస్పీ స్నేహిత, సీఐ రమేష్బాబు పాల్గొన్నారు.