మళ్లీ లీకేజీ కలకలం: ఉలిక్కిపడ్డ తూర్పు గోదావరి జిల్లా: పైప్లైన్ నుంచి ఎగిసిపడ్డ గ్యాస్
కాకినాడ: రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణుగుతున్న దశలో ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో సహజవాయువులు లీక్ అయ్యాయి. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ పైప్లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నిపుణులు.. గ్యాస్ను నియంత్రించారు.
Recommended Video
తూర్పు గోదావరి జిల్లాలోని మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని వెళ్తోన్న పైప్లైన్ నుంచి గ్యాస్ వెలువడింది. తూర్పుపాలెం నుంచి మోరీ గ్యాస్ కలెక్టింగ్ పాయింట్ను అనుసంధానించే పైప్లైన్ అది. గ్యాస్ను సరఫరా చేయడానికి తూర్పుపాలెం మీదుగా భూగర్భంలో వేసిన ఈ పైప్లైన్ మోరీ గ్యాస్ కలెక్టింగ్ పాయింట్కు చేరుతుంది. తూర్పుపాలెం సమీపంలో ఈ భూగర్భ పైప్లైన్లో లీకేజీ చోటు చేసుకుంది.
భయానకం- అచ్చు సినిమాలోలా.. ఎక్కడివారక్కడే - విశాఖ గ్యాస్ లీకేజీ సీసీ ఫుటేజ్ దృశ్యాలు....
పల్చటి పొగలాగా గ్యాస్ వెలువడింది. దీన్ని చూసిన వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ నిపుణులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకేజీని అరికట్టారు. దీనిపై ఓ ప్రెస్నోట్ అధికారులు విడుదల చేశారు. కేస్సనపల్లి వద్ద గల 17వ నంబర్ బావి నుంచి గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించామని, దాన్ని వెంటనే నియంత్రించగలిగామని అన్నారు.
ఈ గ్యాస్ లీకేజీ ఫలితంగా ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదని తెలిపారు. ఈ ఘటన కాస్త తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనకు దారి తీసింది. 2014లో ఇదే జిల్లాలోని నగరం వద్ద గ్యాస్ పైప్లైన్లో పేలుడు సంభవించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. అప్పట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 14 మంది మరణించిన విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ఓఎన్జీసీకి చెందిన భూగర్భ గ్యాస్ పైప్లైన్ నెట్వర్క్ ఉంది.