రాజధాని భూములపై గెజిట్, జగన్ వల్లేనని దేవినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం వేశారు. దీని పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుండి రాజధాని ప్రాంతంలో భూసమీకరణ చేపట్టనున్నారు.
జగన్ కనుసన్నల్లోనే అగ్ని ప్రమాదం: దేవినేని ఉమ
రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. మంగళవారం పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ కనుసన్నల్లోనే దుండగులు పంటలను దగ్ధం చేశారన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న పాత్రదారులను, కుట్ర దారులను వదిలిపెట్టబోమని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.
బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు: కోడెల
ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనను సభాపతి కోడెల శివప్రసాద్ ఖండించారు. మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నర్సారావుపేటలో ఆయన తన నివాసంలో మాట్లాడారు. ఏపీ రాజధాని నిర్మాణ గమ్యం చాలా పెద్దదని, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరనేది విచారణలో తేలుతుందన్నారు. భూములు బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదన్నారు.
రాజధానికి మద్దతుగా భారీ సభ: కేఈ
ఏపీ రాజధాని ఏర్పాటుకు మద్దతుగా ఫిబ్రవరి 20లోగా లక్ష మందితో విజయవాడలో సభ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. పంటలను కాల్చి వేసే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.
రేట్లు పెంచితే సహించం: శిద్దా
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయివేటు ట్రావెల్స్ రేట్లు పెంచితే సహించేది లేదని మంత్రి శిద్దా రాఘవ రావు అన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేకుండా చూస్తామన్నారు. పండుగ సందర్భంగా 2835 ఆర్టీసు బస్సులను అదనంగా నడుపుతామన్నారు.
అడ్డంకులు తొలగిస్తాం: బొజ్జల
తెలుగు గంగ బ్రాంచ్ కాలువ అటవీ అడ్డంకులను తొలగిస్తామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. పది రోజుల్లో వీటిని తొలగిస్తామని చెప్పారు. త్వరలో మరో 5000 టన్నుల ఎర్ర చందనం దుంగలను వేలం వేయడానికి సిద్ధంగా ఉంచామని చెప్పారు.
చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ నాగార్జున
ఏపీ సీఎం చంద్రబాబు దళిత ద్రోహి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా దళితులకు రావాల్సిన వాటా ఎందుకు ఖర్చు చేయడం లేదన్నారు. చంద్రబాబును కచ్చితంగా బోనులో నిలబెడతామన్నారు.