ఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది ముగిసిన సందర్భంగా ఓ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సోమవారమే దీన్ని ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించబోతోంది. ఆ కార్యక్రమం పేరే మన పాలన-మీ సూచన. అయిదురోజుల పాటు దీన్ని నిర్వహించబోతోంది. దీనికోసం ఓ షెడ్యూల్ను తాజాగా ప్రభుత్వం రూపొందించింది.
ఏపీలో తిరగటానికి పాస్ లు అక్కరలేదు .. సర్కార్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు
ఏడాది పాలనపై
వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏడాది పూర్తయింది. గత ఏడాది 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 151, 25 లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. అదే నెల 30వ తేదీన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 23వ తేదీని ప్రాతిపదికన తీసుకుని ఏడాది ముగిసినట్టుగా భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడానికి సమాయాత్తమౌతోంది. ఇందులో భాగంగా మన పాలన-మీ సూచన పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 25వ తేదీన పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, గ్రామ సచివాలయాలు వంటి అంశాలపై వైఎస్ జగన్ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 26వ తేదీన వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కల్పించిన ప్రయోజనాలపై చర్చిస్తారు. దీనికోసం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో చర్చిస్తారు. 27వ తేదీన విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకాలు నిపుణులతో చర్చ ఉంటుంది. 28వ తేదీన పరిశ్రమలకు కల్పించిన, కల్పించాల్సిన వసతులపై పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తారు. 29వ తేదీన ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులపై చర్చ ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Recommended Video
బంపర్ మెజారిటీ సాధించిన నేపథ్యంలో..
గత ఏడాది మే 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా 151 స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. అన్ని వర్గాల ప్రజలు కూడా పార్టీపై విశ్వాసాన్ని ఉంచి ఓటు వేయడం వల్లే బంపర్ మెజారిటీ సాధ్యపడిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకే- ఆయా వర్గాల ప్రజలతో చర్చించి, వారి సూచనలు, సలహాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని అంటున్నారు. మెజారిటీ ప్రజల సూచనలకు అనుగుణంగా, వారి ఆకాంక్షల మేరకు పరిపాలనలో మార్పులను తీసుకుని రావాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.