తెలుగు సీఎంల మైత్రి ముగిసిందా..! తెలంగాణ తప్పుదోవ పట్టిస్తోంది: సుప్రీంలో ఏపీ అఫిడవిట్..!
Recommended Video
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రుల నాటి హామీలు ఏమయ్యాయి. ఏ సమస్య అయినా తెలుగు ప్రజల భవిష్యత్ కోసం చర్చలతోనే పరిష్కరించకుంటామన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పలు దఫాలు భేటీలు నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం పైన తమకు అభ్యంతరం లేదని..కేసు ఉప సంహరించుకుంటామని కేసీఆర్ చెప్పారు.
ప్రత్యేక హోదా ఏపీకీ ఇవ్వాలని అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామన్నారు. ఏదీ జరగలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని రెండు రాష్ట్రాల్లోని ప్రాంతాలను కలుపుతూ..శ్రీశైలం వరకు తీసుకెళ్లే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. కానీ, ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తో అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
తెలంగాణ తప్పుదోవ పట్టిస్తోంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది కాలం క్రితం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ అంశం మీద రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించొద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
కాళేశ్వరంకు జాతీయ హోదా వద్దు
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు విభజన చట్టంలో లేవని, కృష్ణా బోర్డు అనుమతులు లేవని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసినా తెలంగాణ ఆయా ప్రాజెక్టులపై ముందుకెళ్తోందని పేర్కొంది. మరోసారి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
‘కృష్ణా బేసిన్లో 180 టీఎంసీలకు పైగా వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు ప్రాజెక్టులు...450 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టింది. రీఇంజినీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని కోరింది.
పోలవరం కేసుల్లో పార్టీని చేయద్దు
ఇక..ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరంకు అనుకూలంగా కేసీఆర్ మాట్లాడారు. అవసరమైతే కేసులు విత్ డ్రా చేసుకుంటామన్నారు. కానీ, అది జరగలేదు. ఇక, ఇప్పుడు న్యాయ పరమైన పోరాటంలో ఏపీ ప్రభుత్వం పోలవరం కేసుల్లో తెలంగాణను పార్టీలని చేయద్దని అఫిడవిట్ లో స్పష్టం చేసింది.
అయితే, ఇప్పుడు న్యాయపరంగా వాదన వినిపించాల్సిన సమయం రావటంతో..ఏపీ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనికి కేసీఆర్ తో సబంధాలకు సంబంధం లేదంటున్నారు. అయితే, కొద్ది కాలంగా మాత్రం ఇద్దరి ముఖ్యమంత్రుల మైత్రి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు పరిధిలోకి అంశం వెళ్లటంతో..ప్రభుత్వ విధానం స్పష్టం చేయాల్సి ఉంటుందని వాదిస్తున్నారు. కేసీఆర్ కోరిన విధంగా ఏపీ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు అప్పగించిన ఏపీ సీఎం..పోలవరం..ప్రత్యేక హోదా అంశం లో మాత్రం కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకొనే విధంగా ఒత్తిడి చేయలేకపోతున్నారా..లేక వేచి చూసే ధోరణితో ఉన్నారా అనేది స్పష్టం కావాల్సి ఉంది.