ఆర్టీసీకి కొత్త టాస్క్: బోర్డర్ టు బోర్డర్: లాక్డౌన్ ముగిసేంత వరకూ: ప్రత్యేక రైళ్లు
విజయవాడ: లాక్డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన తరలివెళ్తోన్న వలస కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. వారికి ఆహార వసతిని సమకూర్చడంతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. వలస కార్మికులు, విద్యార్థులకు రవాణా వసతిని కల్పించడానికి ప్రత్యేకంగా శ్రామిక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడలోని రాయనపాడు స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఈశాన్య రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మణిపూర్కు చేరుకుంటుంది.
కరోనా టైమ్: ఏపీలో వచ్చేనెల మరో సంక్షేమ పథకం: ఇక వారి ఖాతాల్లోకి రూ.10 వేలు: బీసీ ఓటుబ్యాంకు
అటు రైళ్లు.. ఇటు బస్సులు..
1750 మంది వలస కార్మికులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఈ రైలు ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు. ఈ ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ను రాయనపాడు స్టేషన్లో డీజీపీ గౌతమ్ సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సంయుక్తంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి రెండురోజులకు సరిపడా ఆహారాన్ని అందజేశారు. దీనితోపాటు- ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. బోర్డర్ టు బోర్డర్ వరకు బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రజా రవాణా విభాగం అధికారులకు వైఎస్ జగన్ ఆదేశించారు. వారికి కొత్త టాస్క్ ఇచ్చారు.
ఏపీ మీదుగా వెళ్తోన్న వలస కార్మికుల కోసం..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా గత 50 రోజులకు పైగా లాక్డౌన్ కొనసాగుతోంది. నాలుగోసారి కూడా లాక్డౌన్ను పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఉపాధిని కోల్పోయిన వలస కార్మికులు కాలి నడకన దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాది వైపు కదులుతున్నారు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమిస్తున్నారు. కర్ణాటక, కేరళ తమిళనాడు వైపు నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లాలంటే ఏపీని దాటుకోవాల్సి ఉంటుంది.
ఖర్చులను భరించడానికి..
వందలాది మంది వలస కార్మికులు భార్యా, పిల్లలతో కలిసి జాతీయ రహదారుల మీద నడుస్తూ వెళ్తోన్న దృశ్యాలు ప్రభుత్వాన్ని కదిలించాయి. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చింది. వలస కార్మికుల కోసం జాతీయ రహదారి వెంట ఆహార శిబిరాలను ఏర్పాటు చేసింది. రవాణా వసతిని కల్పించింది. ఇందులో భాగంగా- ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తరలించడానికి అవసరమైన ఖర్చును భరిస్తామని స్పష్టం చేసింది.
ఆప్యాయంగా పలకరించిన డీజీపీ..
ఈశాన్య రాష్ట్రాల్లో తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్తోన్న వారిని గౌతమ్ సవాంగ్ ఆప్యాయంగా పలకరించారు. గౌతమ్ సవాంగ్ కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అధికారే. ఆయన స్వరాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్. అందుకే- తమ కుటుంబ సభ్యుల తరహాలో.. ఆయన వారిని ఆప్యాయంగా పలకరించారు. హ్యాపీ జర్నీ అంటూ సాగనంపారు. ఇప్పటి దాకా 31 శ్రామిక రైళ్లను నడిపించామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
Recommended Video
చిత్తూరు నుంచి ఒడిశా సరిహద్దులకు బయలుదేరి బస్సు..
మరో వైపు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఈ బస్సులు ఆదివారం రాత్రి ఒడిశా వైపు బయలుదేరి వెళ్లాయి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నడిచి వెళ్తోన్న వలస కార్మికులను ఒడిశా సరిహద్దులకు చేరవేయడానికి ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు చిత్తూరు జిల్లా అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలోనూ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తీసుకొస్తామని చెప్పారు.