హైకోర్టు తప్పు పట్టినా నో కాంప్రమైజ్: ప్రభుత్వ భూముల అమ్మకాలపై ముందుకే: గడువు పెంపు
అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రక్రియపై ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడానికి ఇదివరకు విధించిన వేలంపాటల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించింది. వచ్చే నెల 11వ తేదీన గడువు ముగుస్తుందని వెల్లడించింది. బిల్డ్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా జగన్ సర్కార్.. భూముల అమ్మకాలను చేపట్టింది. ఈ విషయంలో హైకోర్టు తప్పు పట్టినప్పటికీ.. అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పటికీ.. దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపించట్లేదు. శుక్రవారం నాటితో ముగియాల్సి ఉన్న ఆన్లైన్ వేలంపాటల గడువును జూన్ 11 వరకు పొడిగించడమే దీనికి నిదర్శనం.
Recommended Video
వివాదాల విశాఖ సహా : కరోనా దెబ్బకు భూములను అమ్ముకుంటోన్న జగన్ సర్కార్: వారికి మళ్లీ ఛాన్స్
ఓపెన్ ఫర్ ఆల్..
భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తోన్న వారి నుంచి అందిన విజ్ఙప్తులను దృష్టిలో ఉంచుకుని గడువును పొడిగించినట్లు మిషన్ బిల్ ఏపీ డైరెక్టర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ఎక్స్ అఫీషియో కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల వారు జూన్ 11వ తేదీ వరకు తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పారదర్శకంగా ఈ వేలంపాటలను నిర్వహిస్తున్నామని, భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారెవరైనా ఇందులో పాల్గొనవచ్చని సూచించారు.
విశాఖ, గుంటూరుల్లో
కరోనా వైరస్, దాని వల్ల విధించిన లాక్డౌన్, కేంద్రం నుంచి సరైన ఆర్థిక సహకారం లేకపోవడం వంటి పరిణామాల మధ్య విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం, గుంటూరుల్లో మొత్తం తొమ్మిది చోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టింది. విశాఖపట్నంలో ఆరు, గుంటూరులో తొమ్మిది చోట్ల ప్రభుత్వ ఆధీనంలోని భూములను విక్రయించబోతున్నట్లు వెల్లడించారు. ఎక్కడ ఎలా ఉన్నది అలాగే ప్రాతిపదికన భూములను అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నారు. జూన్ 11వ తేదీన ఇ-ఆక్షన్ను నిర్వహించబోతున్నామని, ఆసక్తిగల వారు www.ap.gov.in, www.nbccindia.com, wwwtenderwizard.com/nbcc వెబ్సైట్ల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
నవరత్నాల అమలు కోసం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది మేనిఫెస్టో. నవరత్నాల పేరుతో ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే 80 శాతం మేర హామీలను నెరవేర్చామని అధికార పార్టీ నాయకులు పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. అవన్నీ నిధులతో ముడిపడి ఉన్నవే. నవరత్నాలతో పాటు నాడు-నేడు వంటి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఖజానా ఖాళీ కావడంతో నిధులను సమీకరించుకోవడానికి భూములను విక్రయించాల్సి వస్తోందనేది ప్రభుత్వ వాదన. దీనిపై బీజేపీ, జనసేన పార్టీలు మండిపడుతున్నాయి.
హైకోర్టు అభ్యంతరం..
ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దివాళా తీసిందా? అంటూ న్యాయమూర్తులు మండిపడ్డారు. ఏ కారణంతో భూములను అమ్మకానికి పెట్టిందనే విషయాన్ని వివరంగా తెలియజేస్తూ కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ పిటీషన్పై తదుపరి విచారణ వచ్చేనెల 18వ తేదీకి వాయిదా పడింది. ఈలోగా అంటే జూన్ 11వ తేదీ నాటికల్లా ఇ-ఆక్షన్ను పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.