వైఎస్ జగన్ సంచలన నిర్ణయం: తన ప్రభుత్వంపై తానే: దాని ఆధారంగానే యాక్షన్ ప్లాన్:
అమరావతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం బహుశా ఇదివరకు ఎవ్వరూ తీసుకుని ఉండకపోవచ్చు. పరిపాలనలో కూడా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేస్తూ, ముక్కుసూటిగా వ్యవహరిస్తోన్న వైఎస్ జగన్ ఈ సారి తన ప్రభుత్వంపై తానే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబోతున్నారు.
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో డ్యామేజ్ కంట్రోల్కు దిగిన ప్రభుత్వం: మళ్లీ ఉద్యోగం.. కానీ..!
ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా..
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతోంది. గత ఏడాది మే 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 30వ తేదీన వైఎస్ జగన్ విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాను ప్రమణ స్వీకారం చేసిన తేదీని ప్రాతిపదికగా తీసుకున్నారాయన. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఎన్డీటీవీకి కాంట్రాక్టు..
జాతీయ స్థాయి మీడియా ఎన్డీటీవీకి దీనికి సంబంధించిన కాంట్రాక్టును అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించినట్లు చెబుతున్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్బంగా వచ్చిన ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజాభిప్రాయానికి పూనుకోవడం వల్ల చివరి నాలుగేళ్లలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా పరిపాలను సాగించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం పెద్దలు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రాజెక్టులు.. రాజధానిసహా
ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనూహ్య సంక్షేమ పథకాలను చేపట్టిన విషయం తెలిసిందే. అభివృద్ధి పనుల జోలికి వెళ్ల లేదు. అభివృద్ధి పనులను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చామని కూడా అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మూడు రాజధానుల ఏర్పాటు వంటి అంశాలపైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించబోతోంది ప్రభుత్వం.
ఇంగ్లీష్ మాధ్యమంపై
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై జగన్ సర్కార్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దీన్ని చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం అంచనా వేసిన విధంగానే ఫలితాలు వచ్చాయి. 96 శాతానికి పైగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడం వైపే మొగ్గు చూపారు. ఈ విషయంలో జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొట్టారు.
Recommended Video
అదే ఊపుతో
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనపై చేపట్టిన అభిప్రాయ సేకరణ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడంతో.. ఈ సారి ఏకంగా ప్రభుత్వం పైనే ప్రజాభిప్రాయ సేకరణకు దిగబోతున్నట్లు చెబుతున్నారు. అమ్మఒడి, గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ఉద్యోగాల కల్పన సహా ఈ ఏడాది కాలంలో చేపట్టిన అన్ని పథకాలు, నిర్ణయాలపైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి సిద్ధపడుతోంది. అన్నింటి కంటే మూడు రాజధానుల ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, దీనిపై మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.