దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?
అమరావతి: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనక దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై కొత్త ప్రభుత్వ దృష్టి సారించింది. ఆలయంలో పాతుకుపోయిన కాంట్రాక్టు వ్యవస్థ సహా పలు అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమీక్షించబోతోంది. ప్రత్యేకించి- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాంత్రిక పూజల వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహంతో ఉన్నారని, ఆలయాల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన భావిస్తున్నారు.
ఈ నెల 10 లేదా 11వ తేదీల్లో దేవాదాయ శాఖపై వైఎస్ జగన్ సమీక్షించబోతున్నట్లు సమాచారం. అప్పటికే పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుంది. దేవాదాయ శాఖకు మంత్రిని నియమిస్తారు. కొత్త మంత్రితో పాటు ఆ శాఖ అధికారులతో కలిసి దేవాలయాల స్థితిగతులపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటైన తరువాత తొలిసారిగా దేవాదాయ శాఖలో చోటు చేసుకున్న అక్రమాలను సమీక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాంత్రిక పూజలపై ఆరా..
పవిత్రమైన కనక దుర్గమ్మ అమ్మవారి గర్భాలయంలో 2017 డిసెంబర్ 26వ తేదీన తాంత్రిక పూజలను నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది. అమ్మవారి దేవస్థానంతో ఏ మాత్రం సంబంధం లేని ఒకరిద్దరు అర్చకులు గర్భగుడి వద్ద తచ్చాడిన దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డిసెంబర్ 26వ తేదీన గర్భాలయాన్ని మూసివేసిన తరువాత.. రాత్రి 10:45 నిమిషాల ప్రాంతంలో దేవస్థానంతో సంబంధం లేని అర్చకులు తలుపులను తీసినట్లు అధికారుల విచారణలో తేటతెల్లమైంది. గర్భాలయంలోకి ప్రవేశించిన అనంతరం వారు ఆలయ నిబంధనలు, సంప్రదాయాలకు విరుద్ధంగా తాంత్రిక పూజలు నిర్వహించినట్లు వెల్లడైంది.
వెలుగు చూడని అసలు కారణాలు
దీని వెనుక గల అసలు కారణమేంటనేది ఇప్పటికీ వెలుగు చూడలేదు. తాంత్రిక పూజల ఘటనపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించి, చేతులు దులుపుకొన్నారు. ఆ తరువాత ఆ విచారణ ఏమైందేది అతీ గతీ లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటన వ్యవహారంలో చూసీ, చూడనట్టు వ్యవహరించడంతో.. తాంత్రిక పూజల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు, ప్రభుత్వంలోని బడా నేతల ప్రమేయం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. ఆ తరువాత.. తాంత్రిక పూజల వ్యవహారాన్ని అందరూ మరిచిపోయారు.
కూపీ లాగుతున్న సర్కార్..
ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణమేంటనే విషయంపై వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. అసలు కారణాలను వెలికి తీయాలని భావిస్తోంది. ఈ ఘటనపై కొత్త ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే- ఈ ఘటనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న అధికారులు లేదా నేతల పీఠాలు కదులుతాయని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం వేసిన విచారణ కమిటీని రద్దు చేసి, కొత్తగా మరో కమిటీని వేయవచ్చని దేవాదాయ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. దేవాదాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ కొత్త కమిటీని కూడా నియమించే అవకాశాలు లేకపోలేదు.
ఐఎఎస్ అధికారికి ఆలయ బాధ్యతలు
చాలాకాలంగా దుర్గ గుడి ఆలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి లేరు. ఒకరిద్దరు సీనియర్ అధికారులకు ఈఓ బాధ్యతలను అప్పగించింది గత ప్రభుత్వం. ఈ సారి దీనికి భిన్నంగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఏటా అధిక ఆదాయాన్ని ఆర్జించే కనకదుర్గమ్మ అమ్మవారి గుడితో పాటు సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెనుగంచి ప్రోలు తలుపులమ్మ తల్లి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వంటి దేవస్థానాలను ఒక యూనిట్గా తీసుకుని, వాటి పర్యవేక్షణ బాధ్యతలను ఐఎఎస్ అధికారికి అప్పగించవచ్చని చెబుతున్నారు.
పాత పాలక మండళ్లకు గుడ్ బై
దీనితో పాటు వివిధ ఆలయాల్లో పాతుకు పోయిన పాత పాలక మండళ్లను రద్దు చేసే దిశగా కూడా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా.. కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తు చేస్తున్నారని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కోరిందని, త్వరలోనే ప్రధాన ఆలయాల పాలక మండళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.