డిఎస్సీ నిర్వహణ కూడా ఎపిపిఎస్సీకే...టెట్ వాయిదా పడే అవకాశం...
విజయవాడ: టీచర్ల భర్తీకి సంబంధించి అతి ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. డిఎస్సీ నిర్వహణ విద్యాశాఖ కాకుండా ఎపిపిఎస్సీ చేపట్టనుంది. ఈ మేరకు నిర్ణయం కూడా జరిగిపోయినట్లు ఎపిపిఎస్సీ చైర్మన్ పిన్నమనేని భాస్కర్ ప్రకటించారు. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
డిఎస్సీని మొదటిసారి ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబోతున్నట్లు ఎపిపిఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ విషయమై విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుతో చర్చించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. ఈ చర్చల్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి పాల్గొన్నారని చెప్పారు. జనవరి నుంచి అమరావతిలో ఏపీపీఎస్సీ కార్యకలాపాలు మొదలవుతాయని వెల్లడించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తామని ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి త్వరలో ఆర్థిక శాఖ అనుమతి రాగానే కొత్త నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఉదయభాస్కర్ పేర్కొన్నారు. కోర్టు కేసుల వల్ల పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ వెల్లడించారు.
మంత్రి గంటా సూచనలు...
ఎపిపిఎస్సీ నిర్వహించే డిఎస్సీ ని ఇకపై టీచర్చ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ను టి ఆర్ టి గా వ్యవహరిస్తారు. ఈ ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)ను ఏపీపీఎస్సీకి అప్పగించే అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణితో చర్చించారు. టీఆర్టీ నిర్వహణకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్ సుముఖత వ్యక్తం చేశారు. ఎలాంటి సాంకేతిక, ఇతర ఇబ్బందులు రానివ్వకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, జూన్ 12, 2018కల్లా ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందించేలా ముందుకెళ్లాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. మరోవైపు, టీర్టీటీని ఆన్లైన్లో నిర్వహించాలా? ఆఫ్లైన్లో నిర్వహించాలా? అనేదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
టెట్ వాయిదా ఖాయమా?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడే అవకాశం ఉంది. టెట్ షెడ్యూల్ విడుదలకు, పరీక్ష నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉందని, పరీక్షకు చదివేందుకు సమయం సరిపోదని వినతులు వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ పరీక్ష జనవరి 17 నుంచి 27వరకు జరగాలి. దీన్ని మరో 15రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
టెట్ అభ్యర్థుల సమస్యలు...
టెట్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో హాల్టిక్కెట్ నెంబర్ వేయాలనే నిబంధన పెట్టారు. గతంలో టెట్ రాసిన అభ్యర్థులు చాలామంది తమ హాల్టిక్కెట్ నెంబర్లు మరచిపోవడం, వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఇలాంటివారు దరఖాస్తు చేయాలంటే ఇబ్బందిగా మారింది. 2014లో టెట్, డీఎస్సీ కలిపి నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి ఏపీలో 2011, 2012లో టెట్ నిర్వహించారు. ఆ సమయంలో పరీక్ష రాసినవారిలో కొందరు తమ ధ్రువీకరణ పత్రాలను పొగొట్టుకున్నారు. దీంతో ఆన్లైన్లోనే పుట్టిన తేదీ లేదా ఇతర ఏదైనా సమాచారం
రెండు రోజుల్లో తేలనున్న ఖాళీల లెక్కలు...
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీల లెక్క రెండు రోజుల్లో తేలిపోనుంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం నుంచి విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో ఈలోపే ఖాళీల లెక్క తేల్చాలని మంత్రి గంటా అధికారులకు సూచించారు. ఆదర్శ పాఠశాలల్లో తగ్గనున్న పోస్టుల విషయమూ ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రారంభం కాని మూడు ఆదర్శ పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అవసరమైతే ఏదైనా పాఠశాల లేదా వేరే భవనాల్లో ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. వీటికి మంజూరైన 60 పోస్టులను డీఎస్సీలో కలపాలని ఆదేశించారు. అయితే ఆదర్శ ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.